
దేశవ్యాప్తంగా తొలి దశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. లోక్సభ ఎన్నికల సందర్భంలో భాగంగా సిక్కిం ప్రాధాన్యత సంతరించుకుంది.తూర్పు సిక్కింలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాలు వైరల్ అవుతున్నాయి. కేవలం 180 మంది ఓటర్ల కోసం మంచుకొండపై రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తూర్పు సిక్కిం ప్రాంతంలోని జ్ఞాతంగ్ మంచుకొండపై… సముద్ర మట్టానికి 13,500 అడుగుల ఎత్తులో వీటిని ఏర్పాటు చేశారు.
జ్ఞాతంగ్ మచోంగ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ కేంద్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆకర్షించాయి. ఇండియా-చైనా బోర్డర్ లో ఈ పోలింగ్ సెంటర్లున్నాయి. ఇక్కడి వాతావరణం గురించి తెలిసినవారు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించడం సాహసమే అంటున్నారు. దట్టంగా మంచుకమ్ముకొని ఉండటంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మరో 48 గంటలు మంచు కురియడంతో పాటు వర్షం పడే ఛాన్స్ కూడా ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు జీరో డిగ్రీ ఉష్ణోగ్రతలో విధులు నిర్వహించిన పోలింగ్ సిబ్బంది… ఎన్నికల సామాగ్రితో పాటు రగ్గులు, స్వెట్టర్లు కూడా తీసుకెళ్లారు.