- చేవెళ్ల, షాద్నగర్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్
హైదరాబాద్/ రంగారెడ్డి/మేడ్చల్/షాద్ నగర్/చేవెళ్ల, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా సిటీ శివారు జిల్లాల్లోనూ 60 శాతం లోపే పోలింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం పోలింగ్ నమోదైంది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్ నగర్ స్థానాల పరిధిలో చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్తో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. రంగారెడ్డి జిల్లాలో 2018లో 62 శాతం నమోదు కాగా.. ఈ సారి 59.06 శాతం పోలింగ్ నమోదైంద. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో 9.30 గంటల వరకు, చేవెళ్లలో 10 గంటలకు పోలింగ్ కొనసాగింది. చేవెళ్ల సెగ్మెంట్లో 2 లక్షల 62 వేల 505 మంది ఓటర్లు ఉండగా.. లక్షా 94 వేల 558 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల సెగ్మెంట్లో పోలింగ్ శాతం 74.25 శాతం నమోదైంది. షాద్ నగర్ సెగ్మెంట్లో లక్షా 93 వేల 714 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 81.96 నమోదైందని అధికారులు తెలిపారు. మొత్తంగా రంగారెడ్డి జిల్లాలో 59.06 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మేడ్చల్ జిల్లాలో..
మేడ్చల్ జిల్లాలోని మేడ్చల్, ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. 2018లో మేడ్చల్జిల్లాలో 72 శాతం పోలింగ్ నమోదైంది.ఈసారి సాయంత్రం 5 గంటల వరకు 49.25 శాతం నమోదైంది. పోతారంలో కొద్దిసేపు ఈవీఎంలు మొరాయించగా వాటిని మార్చాక మళ్లీ పోలింగ్ ప్రారంభమైంది.