కాలుష్య నియంత్రణ…డీజిల్ వాహనాలకు చెక్

కాలుష్య నియంత్రణ…డీజిల్ వాహనాలకు చెక్

ఏటా పెరుగుతున్న కాలుష్య కారకాల సంఖ్యను తగ్గించేందుకు పలు సంస్థలు డీజిల్ వాహనాలకు చెక్ పెట్టే దిశగా సాగుతున్నాయి. దీంతో డీజిల్ వాహనాలు తీసుకున్న వారిలో గందరగోళం నెలకొంది. కాలుష్యంపై పెరుగుతున్న ఆందోళన కూడా డీజిల్‌ ఇంజిన్లకు స్వస్తి పలికేందుకు కారణమైంది. పెట్రోల్ వాహనాలకంటే డీజిల్ వాహనాల ద్వారా కాలుష్యం రెట్టింపుగా ఉండటంతో…. గ్రేటర్ హైదరాబాద్ లో కూడా డీజిల్ వెహికిల్స్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 3,000 పట్టణాల్లో గ్రీన్‌ పీస్‌ అండ్‌ ఎయిర్‌ విజువల్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో తొలి 30 అత్యంత కాలుష్య పట్టణాల్లో 22 భారత్‌లోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఢిల్లీలో కాలుష్యాన్ని అడ్డుకొనేందుకు సుప్రీం కోర్టు రంగంలోకి దిగడం డీజిల్‌ కార్ల డిమాండ్‌ పై ప్రభావం చూపింది.

దీంతో గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కూడా పదేళ్లు దాటిన డీజిల్‌ వాహనాలపై నిబంధనలు విధించింది. దీంతో పెట్రోల్, విద్యుత్ వాహనాలు మార్కెట్లను భవిష్యత్ లో భారీగా పెరగనున్నట్టు సమాచారం. ప్రభుత్వం కూడా దేశంలో విద్యుత్తు, సీఎన్‌జీ వాహనాల తయారీని ప్రొత్సహించే వాతారణాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొంది.

దీనిలో భాగంగా 2030 నాటికి 10వేల సీఎన్‌జీ పంపులను ప్రారంభించనుంది. దీంతోపాటు ఎల్‌ఎన్‌జీ ఆధారిత వాహనాలను ప్రోత్సహించనుంది. మరోవైపు ఫోక్స్‌ వ్యాగన్‌ వాహనాల కేసు తర్వాత డీజిల్‌ ఇంజిన్లపై నిఘా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో నిబంధనల అమల్లో ఏమాత్రం తేడా వచ్చినా భారీగా జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కంపెనీలు కూడా డీజిల్‌ ఇంజిన్ల వైపు మొగ్గు చూపడంలేదు. 2020 తర్వాత నుంచి డీజిల్‌ ఇంజిన్లకు గిరాకీ తగ్గుతుందని బ్లూమ్‌బెర్గ్‌ న్యూస్‌ ఏజెన్సీ ఫైనాన్స్‌ ఒక సర్వేలో తెలిపింది.