ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన పేదలు

ఇండ్ల స్థలాల కోసం కదం తొక్కిన పేదలు

చెన్నూర్​, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్​లో ఇండ్ల స్థలాల కోసం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు కదం తొక్కారు. చెన్నూర్, కోటపల్లి మండలాల నుంచి సుమారు 500 మంది ఆదివారం ఉదయం చెన్నూర్​కు వచ్చారు. పద్మనగర్​కాలనీ సమీపంలో ఉన్న సర్వేనంబర్​8లోని ప్రభుత్వ భూమితో కర్రలు, చీరలతో తాత్కాలికంగా డేరాలు వేసుకున్నారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్​గోవింద్​నాయక్​, రెవెన్యూ ఇన్​స్పెక్టర్​తిరుపతి, చెన్నూర్​, కోటపల్లి సీఐలు వాసుదేవరావు, విద్యాసాగర్​, ఎస్సైలు చంద్రశేఖర్, వెంకట్ అక్కడికి చేరుకున్నారు.

ప్రభుత్వ భూమిని ఖాళీ చేయాలని, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ నిరుపేదలమైన తమకు సొంత ఇండ్లు లేకపోవడంతో కిరాయి ఇండ్లలో ఉంటున్నామన్నారు. ప్రభుత్వం డబుల్​బెడ్​రూం ఇండ్లు ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చి, ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయామన్నారు. ప్రభుత్వం మాట తప్పడంతోనే తాము ఇక్కడ గుడిసెలు వేసుకున్నామన్నారు. వెంటనే గుడిసెలు వేసుకున్న వారికి రెండు గుంటల జాగ, ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. వర్షం కురుస్తున్నా పట్టించుకోకుండా సాయంత్రం వరకు ఆందోళన కొనసాగించారు. 

10 మందిపై కేసు


చెన్నూర్​కు చెందిన పిల్లలమర్రి రాజబాపు అనే వ్యక్తి తన భూమిలోకి చొరబడి డేరాలు వేసుకున్నారని కంప్లయింట్​ చేశాడు. దీంతో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బోడంకి చందు, కార్యవర్గ సభ్యురాలు దాసరి రాజేశ్వరి, కోటపల్లి మండల కార్యదర్శి కావిరి రవీందర్, చెన్నూర్​టౌన్​ ప్రెసిడెంట్​ఎండీ.అవీస్​అహ్మద్, మారయ్య,నవీన్, దాసరి సంధ్య, ఎస్​కే.ఆస్మాబేగం, గడ్డం పోశక్క, సుందిళ్ల రాజేశ్వరి, మణితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు చెన్నూర్​ సీఐ వాసుదేవరావు తెలిపారు.