చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నం : జగదీశ్ రెడ్డి

చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్నం :  జగదీశ్ రెడ్డి

తుంగతుర్తి, వెలుగు : చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నామని  విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో తుంగతుర్తి బీఆర్ఎస్  అభ్యర్థి గాదరి కిశోర్ కుమార్ తరఫున ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకుముందు అర్వపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కిశోర్‌‌కు బీఫామ్​ అందజేశారు.  అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రేషన్ ద్వారా అందరికీ సన్నబియ్యం, సబ్సిడీ ద్వారా రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలనే నిర్ణయాలు సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనమన్నారు.  

2014 ముందు కక్షలతో రక్తమోడిన నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిశోర్‌‌కే దక్కుతుందన్నారు.  కిశోర్ ​హయాంలో  నియోజకవర్గం ససశ్యామలం అయ్యిందని, పారిశ్రామిక హబ్‌ను నెలకొల్పి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్నదే ఆయన ఆశయమన్నారు. కిశోర్‌‌ను మరోసారి ఆశీర్వదించి తుంగతుర్తికి తోడ్పాటు అందించాలని  పిలుపునిచ్చారు.