
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ ముగిసింది. బుధవారం (జూన్ 11) 9 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. 2025, జూన్14వ తేదీన మళ్లీ విచారణకు హాజరుకావాలని ప్రభాకర్ రావును ఆదేశించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. 9 గంటల పాటు ప్రభాకర్ రావుపై పోలీసుల ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు మాత్రం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోనే అంశాలనే తిప్పి తిప్పి చెబుతోన్నట్లు సమాచారం.
ALSO READ | భారీగా విల్లాలు,ఓపెన్ ప్లాట్లు.. వందల కోట్ల ఆస్తులు..ఇది నూనె శ్రీధర్ అక్రమాస్తుల చిట్టా
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మొదట సోమవారం (జూన్ 9) కూడా పోలీసుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 8 గంటల పాటు ప్రభాకర్ రావును విచారించిన పోలీసులు.. ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీత్ రావుతో సంబంధాలతో పాటు ఎస్ఐబీ చీఫ్గా కార్యకలాపాలపై ప్రభాకర్ రావును విచారించారు.
ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్ల ధ్వంసం తో పాటు డాటా మాయంపై ప్రశ్నించారు. కొన్ని దశాబ్దాలుగా స్టోర్ చేసిన ఉగ్రవాద, తీవ్రవాద సమాచార మాయంపై ఆరా తీశారు. ప్రణీత్ రావుకి హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయమని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. పాత హార్డ్ డిస్క్లు తీసి కొత్త హార్డ్ డిస్క్లు పెట్టాలని ఎవరు చెప్పారంటూ ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు.