- ట్యాక్స్ వివరాలను అర్థం చేసుకోవడం కీలకం
- సంపద పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ బెటర్
- చిన్న ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు.. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పొందొచ్చు
న్యూఢిల్లీ: మనందరం డబ్బు సంపాదించాలనే స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి అసెట్స్లలో ఇన్వెస్ట్ చేస్తాం. చిన్న ఇన్వెస్టర్లు సంపద పెంచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) బెటర్ అని ఎక్స్పర్టులు చెబుతున్నారు. వీటి ద్వారా వేరు వేరు అసెట్స్లలో పెట్టుబడి పెట్టి మంచి రాబడులు పొందొచ్చని, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, లిక్విడిటీ వంటివి పొందొచ్చని తెలిపారు.
అయితే చాలా మంది ఇన్వెస్టర్లు ఫండ్స్ నుంచి ఎప్పుడు డబ్బు విత్డ్రా చేయాలో, ట్యాక్స్ను ఎలా సేవ్ చేసుకోవాలో తెలియకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి గురించి తెలుసుకుందాం.
ఇలా అయితే డబ్బులు తీసేద్దాం..
మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇస్తోందా? పనితీరు బాగానే ఉందా? వంటి అంశాలను పరిశీలించడం కొంచెం కష్టమైన పనే. మీ ఫండ్ ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం పాటు నిరంతరం అండర్పర్ఫార్మ్ (అనుకున్నంత రిటర్న్ ఇవ్వకపోవడం) చేస్తూ, బెంచ్మార్క్ (ఉదా: సెన్సెక్స్) లేదా ఇతర ఫండ్స్ కంటే బలహీనంగా ఉంటే, మీరు పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం బెటర్.
రీబ్యాలెన్సింగ్ కోసం కూడా ఫండ్ నుంచి డబ్బు విత్డ్రా చేసుకోవాలి. ఉదాహరణకు, 60శాతం ఈక్విటీ, 40శాతం డెట్ ఫండ్స్తో పోర్ట్ఫోలియో క్రియేట్ చేశారని అనుకుందాం. కొన్ని సంవత్సరాల తర్వాత ఫండ్స్లోని పెట్టుబడులు విలువ రూ.25 లక్షలకు పెరిగింది. అందులో రూ.18 లక్షలు నాలుగు ఈక్విటీ ఫండ్స్లో ఉంటే, మీ ఈక్విటీ అలొకేషన్ 72శాతానికి పెరిగినట్టు అవుతుంది. కాబట్టి దీనిని తిరిగి 60శాతం పరిధిలోకి తీసుకురావడానికి కొంత డబ్బు విత్డ్రా చేయాలి.
ఇన్వెస్ట్ చేసిన లార్జ్-క్యాప్ ఫండ్, పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్స్) కంటే బలహీనంగా ఉంటే, ఇండెక్స్ ఫండ్స్కి మారడం మంచిది.ఒక నిర్దిష్ట లక్ష్యంతో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకుంటే కూడా విత్డ్రా చేసుకోవాలి. ఉదాహరణకు, ఇన్వెస్టర్ 2028 నాటికి రూ.25 లక్షలకు చేరుకోవాలని పెట్టుబడి పెట్టి, 2027లోనే ఆ లక్ష్యాన్ని చేరుకుంటే, ముందుగానే విత్డ్రా చేసుకోవడం మంచిది. ఎందుకంటే అధిక స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ వల్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో నష్టం కూడా రావొచ్చని ఎక్స్పర్టులు చెబుతున్నారు.
కేటగిరీని బట్టి పన్ను...
- మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను విత్డ్రా చేసినప్పుడు టాక్స్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. ఫండ్ రకం (ఈక్విటీ/డెట్), హోల్డింగ్ పీరియడ్ (షార్ట్/లాంగ్ టర్మ్)పై ఆధారపడి ట్యాక్స్ ఉంటుంది. ఈక్విటీ ఫండ్ హోల్డింగ్ పీరియడ్ ఒక ఏడాది లోపు ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ)పై 15 శాతం ట్యాక్స్ పడుతుంది. సర్ ఛార్జీ, సెస్ అదనం. అదే హోల్డింగ్ పీరియడ్ ఏడాది కంటే ఎక్కువ ఉంటే లాంగ్టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ)పై 10 శాతం ట్యాక్స్ పడుతుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉండదు. కానీ, రూ.1.25 లక్షలలోపు ప్రాఫిట్పై ఎల్టీసీజీ ట్యాక్స్ ఉండదు.
- డెట్ ఫండ్స్లో అయితే మూడేండ్ల కంటే తక్కువగా హోల్డింగ్ పీరియడ్ ఉంటే లాభాలపై ట్యాక్స్ స్లాబ్ రేటు ప్రకారం పన్ను పడుతుంది. మూడేండ్ల కంటే ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ ఉంటే లాభాలపై 20శాతం ట్యాక్స్ పడుతుంది. ఇండెక్సేషన్ ప్రయోజనం ఉంటుంది. అంటే ప్రాఫిట్స్ను లెక్కించేటప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఉదా. డెట్ ఫండ్లలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తే, ఐదేళ్ల తర్వాత ఆ విలువ రూ.1,60,000 కి వెళ్లిందని అనుకుందాం. అప్పుడు ప్రాఫిట్ 60 వేలు అవుతుంది. కానీ, కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ (సీఐఐ) లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు ప్రాఫిట్ 60 వేల నుంచి తగ్గుతుంది. ఆ మిగిలిన అమౌంట్పైనే 20 శాతం ట్యాక్స్ వేస్తారు.
