ఉమ్మడి జాబితాలోకి హెల్త్!

ఉమ్మడి జాబితాలోకి హెల్త్!

‘లక్షలు లేకపోయినా కాళ్లూ చేతులూ లక్షణంగా ఉంటే చాలు. అదే పది వేలు. బలుసాకు తినైనా బతికేయొచ్చు’ అనుకునేవారు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆర్థికంగా వెనకబడ్డవారికి హెల్త్​పరంగా ఏదైనా జరిగితే ఆదుకోవటానికి మోడీ సర్కారు ‘ప్రధానమంత్రి జన్​ ఆరోగ్య యోజన’ని ఏడాదిన్నర కిందటే తెచ్చింది. ఈ బీమా పథకాన్ని మరింత బాగా అమలుచేసి ప్రజలకు ఆరోగ్య హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది. ఎంబీబీఎస్​, మెడికల్​ పీజీ సీట్లు, హాస్పిటల్స్​ సంఖ్య పెంచనుంది. హెల్త్​ సెక్టార్​ని ఉమ్మడి జాబితాలోకి తేనుంది.

ఆరోగ్య రంగంలో సంస్కరణలకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందు​లో భాగంగా చేపట్టాల్సిన చర్యల్ని సూచించేందుకు ఏర్పాటుచేసిన హైలెవెల్​ కమిటీ ఈ మధ్యే రిపోర్ట్​ ఇచ్చింది. దీంతో వాటి అమలుకు ప్రభుత్వం చకచకా కదులుతోంది. రాజ్యాంగం ప్రకారం పబ్లిక్​ హెల్త్​ కేర్​​ అనేది ఇన్నాళ్లూ రాష్ట్రాల జాబితాలోనే ఉంది. దాన్ని ఇకపై కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి తేనున్నారు. తద్వారా ఈ సెక్టార్​పై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనానికి కేంద్రం చెక్​ పెట్టి తన పట్టు పెంచుకుంటుంది. హైలెవెల్​ కమిటీ ఇచ్చిన రికమండేషన్లలో ఇది కూడా ఒకటి.

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్​ రంగంలో హాస్పిటల్స్​ను ఏర్పాటుచేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా సహకరించాలి. భూములను త్వరగా కేటాయించాలి. కరెంట్​, వాటర్​, భవన నిర్మాణ, రిజిస్ట్రేషన్​ అనుమతులు వంటి వాటిని సకాలంలో మంజూరు చేయాలి. 200 పడకల హాస్పిటల్​ కట్టాలంటే కోట్లలో ఖర్చవుతుంది. అంత బడ్జెట్​ లేని ఆర్గనైజేషన్ల కోసం రైతులకు ఇచ్చినట్లు తక్కువ వడ్డీకి రుణాలు అందజేయాలి. రెసిడెన్షియల్​ రేట్లకే నిరంతరం విద్యుత్​ సరఫరా జరిగేలా స్పెషల్​ క్లియరెన్స్​లు ఇవ్వాలి.

ఈ పనులన్నీ సజావుగా సాగాలంటే వేర్వేరు ప్రభుత్వ విభాగాల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. సెంట్రల్​ గవర్నమెంట్​కి సలహాదారుగా వ్యవహరిస్తున్న నీతి ఆయోగ్​ రూపొందించిన అడ్వైజరీ నోట్​ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అదనపు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ఆపరేషన్ల సంఖ్య డబుల్​ అవుతుంది. ఆ డిమాండ్​ను తట్టుకోవాలంటే కొత్త మెడికల్​ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.

కేటాయింపులు పెంచాలి

15వ ఆర్థిక సంఘం ఏర్పాటుచేసిన ఈ హైలెవెల్​ కమిటీ వివిధ రంగాల ప్రముఖులతో చర్చించాకే డిటేల్డ్​గా 120 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఈ సంప్రదింపుల్లో నీతి ఆయోగ్​, హెల్త్​ మినిస్ట్రీ అధికారులను, పాలసీ నిపుణులను, కార్పొరేట్​ హాస్పిటల్స్​ ప్రతినిధులను భాగస్వాముల్ని చేశారు. వీళ్లంతా కలిసి చాలాసార్లు మాట్లాడుకొని చెప్పుకోదగ్గ రికమండేషన్లే ఇచ్చారు. హెల్త్​ కేర్​కి కేటాయించే బడ్జెట్​ వాటాని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని వారందరూ సూచించారు.

భిన్న వాదనలు

ప్రైమరీ హెల్త్​ కేర్​లో భారీ పెట్టుబడులు పెట్టాలని, అవి మొత్తం బడ్జెట్​ కేటాయింపుల్లోని మూడులో రెండో వంతుకు దాదాపు సమానంగా ఉండాలని కమిటీ సభ్యు​లు అన్నారు. రాష్ట్రాల హెల్త్​ బడ్జెట్​లోని కనీసం రెండు శాతాన్ని రీసెర్చ్​ యాక్టివిటీస్​కి ఇవ్వాలని చెప్పారు. అయితే.. మెజారిటీ రికమండేషన్లపై పబ్లిక్​ హెల్త్ ఎక్స్​పర్ట్​లు భిన్నంగా స్పందిస్తున్నారు. కార్పొరేట్​ హాస్పిటల్స్​ ప్రతినిధులు తమకు అనుకూలంగా సూచనలు ఇచ్చారంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ సలహాదారు సునీల్ నందరాజ్​ తప్పుపట్టారు.

అందరికీ ఆరోగ్యం హక్కు

2021 ఆగస్టు 15 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. అప్పటికి ‘ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు’గా ప్రకటించాలని మోడీ గవర్నమెంట్​ గట్టి పట్టుదలతో ఉంది. ఇది సాధించడానికి వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 3,000 నుంచి 5,000 వరకు 200 పడకల ప్రైవేట్​ హాస్పిటల్స్​ను అదనంగా ఏర్పాటు చేయించటానికి ప్లాన్​ రెడీ చేసింది. ఎంబీబీఎస్ సీట్లను 2025 నాటికి రెట్టింపు చేయాలని చూస్తోంది. పీజీ మెడికల్​ సీట్ల సంఖ్యను కూడా వాటికి సమానం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రైవేట్​ సంస్థలు కొత్త దవాఖానాలను టయర్​–2, టయర్​–3 టౌన్లలో, వైద్య సేవలు అందుబాటులో లేని అండర్​ సర్వీస్డ్​ ప్రాంతాల్లో ఏర్పాటుచేసేందుకు అన్ని విధాలుగా సహకరించాలంటూ కేంద్రం రాష్ట్రాలను ఇటీవల కోరింది. రాష్ట్రాలు సానుకూలంగా స్పందించటం మోడీ ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇండస్ట్రీ–ఫ్రెండ్లీ పాలసీని రూపొందించింది. ఈ యోజన మరింత బాగా అమలు కావాలంటే హెల్త్​ కేర్​ సెక్టార్​లో ఇప్పుడున్న వసతులు ఏమాత్రం చాలవనే అంచనాకు వచ్చింది.