
- 6 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: నేషనల్ మెన్స్, విమెన్స్ సీనియర్ సెలెక్షన్ కమిటీలో ఖాళీగా ఉన్న పోస్ట్లను భర్తీ చేసేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఈ మేరకు మెన్స్ సెలెక్షన్ కమిటీలో రెండు, విమెన్స్ ప్యానెల్లో నాలుగు ఖాళీల కోసం శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానించింది. పాత వాళ్లలో ఎవర్ని తొలగిస్తారు? కొత్తగా వచ్చే వారు ఏ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తారనే దానిపై బీసీసీఐ స్పష్టత ఇవ్వలేదు. అయితే మెన్స్ కమిటీలోకి కొత్తగా సౌత్, సెంట్రల్ జోన్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాకు అవకాశం దక్కనుంది. ప్రస్తుతం సౌత్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న తమిళనాడు మాజీ బ్యాటర్ ఎస్. శరత్ పదవీకాలం పూర్తి కావడంతో అతన్ని జూనియర్ సెలెక్షన్ కమిటీకి చీఫ్గా వేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా పని చేస్తున్న తిలక్ నాయుడు పదవీ కాలం ముగియనుంది. ఈ కమిటీలో ఇతర సభ్యులుగా క్రిషన్ మోహన్, రణదేబ్ బోస్, పాథిక పటేల్, హరీందర్ సింగ్ సోధీ ఇతర సభ్యులుగా ఉన్నారు. సీనియర్ కమిటీలో శరత్ ప్లేస్ను ఓజాతో భర్తీ చేసే చాన్స్ ఉంది. ఇక సెంట్రల్ జోన్ నుంచి ఎవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రస్తుత కమిటీలో ఉన్న ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ గతంలో ఈస్ట్ జోన్కు ఆడారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (వెస్ట్ జోన్), అజయ్ రాత్రా (నార్త్ జోన్)కు ఎక్స్టెన్షన్ లభించింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు సంబంధించిన నిబంధనలు పాత వాటినే కొనసాగించారు.
అభ్యర్థులు 7 టెస్ట్లు, 10 వన్డేలు లేదా 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల అనుభవంతో పాటు కనీసం ఐదేళ్ల ముందే ఆటకు వీడ్కోలు పలికి ఉండాలి. బీసీసీఐ క్రికెట్ కమిటీ సభ్యుడిగా ఐదేళ్ల కంటే ఎక్కువగా ఉండకూడదు. విమెన్స్ కమిటీలో ఉన్న ఐదుగురు మెంబర్స్లో నీతూ డేవిడ్ (చైర్ పర్సన్), రేణు మార్గరేట్, ఆరతి వైద్య, కల్పనా వెంకటాచర్ పదవీకాలం పూర్తయింది. ఐదో మెంబర్ శ్యామా డేకు ఇంకా కొనసాగే చాన్స్ ఉంది. కాబట్టి ఇందులోకి నలుగురు కొత్త వారిని తీసుకోనున్నారు. సెప్టెంబర్ 10లోగా దరఖాస్తులను సమర్పించాలి.