
అక్రమ ఆన్లైన్ బెట్టింగ్యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్రాజ్( Prakash Raj ) బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ముందు విచారణకు హాజరైయ్యారు. బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింత్ర వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్చేసిన సెలబ్రిటీలకు ఈ నెల 21న ఈడీ సమన్లు జారీ చేసింది. దీంతో ప్రకాష్ రాజ్ఈ రోజు ( జూలై 30, 2025 ) విచారణకు హాజరైయ్యారు.
పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణకు అధికారులు షెడ్యూల్ సిద్ధం చేశారు.
ఈ కేసులో ప్రకాష్ రాజ్ తోపాటు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న రానా దగ్గుబాటి హాజరు కావాల్సి ఉండగా.. ముందస్తు సినిమా షూటింగ్ కారణంగా సమయం కోరాడు. వచ్చే నెల 6న విచారణకు హాజరు కావాల్సిన విజయ్ దేవరకొండ కూడా సమయం ఇవ్వాలని అడిగాడు. దీంతో వీరిద్దరిని ఆగస్టు 11న హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని కార్యాలయం సమన్లు పంపింది. వీరు జంగ్లీ రమ్మీ, లోటస్ 365, జీత్విన్ వంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లను ప్రయోట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్లాట్ ఫామ్ లు అక్రమ బెట్టింగ్ లు, జూదం ద్వారా కోట్లాది రూపాయల నిధులను ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి.