
విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రకాష్ రాజ్.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో సగం మంది సెలబ్రిటీలు అమ్ముడు పోయారని, మిగిలిన సగం మంది భయంతో మౌనాన్ని ఆశ్రయించారని విమర్శలు చేశాడు ప్రకాష్ రాజ్. సినీ పరిశ్రమకు చెందిన ఎవరూ కూడా దేశ రాజకీయాల పట్ల స్పందించడం లేదని ప్రభుత్వానికి అమ్ముడు పోయారని అన్నాడు.
నేరం చేసిన వాళ్లనైనా చరిత్ర క్షమిస్తుంది కానీ, నిజాలు మాట్లాడకుండా మౌనం దాల్చిన వారిని మాత్రం క్షమించదన్నాడు. తాను ఏదైనా సూటిగా చెబుతానని, రాజకీయ విషయాలపై తన అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు బయటపెడతానని, అందుకే తనకు బాలీవుడ్లో చాన్సెస్ తగ్గాయని ఇటీవల ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
అలాగే పహల్గాం ఘటన కారణంగా పాకిస్థానీ నటుడు పవద్ ఖాన్ నటించిన అబిర్ గులాల్ సినిమాను కేంద్రం నిషేధించడాన్ని కూడా ప్రకాష్ రాజ్ తప్పుబట్టాడు. అసలు ఏ సినిమానైనా సరే నిషేధించడం తగదన్నాడు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.