
సూర్యాపేట, వెలుగు: గర్భిణికి అబార్షన్ చేయగా వైద్యం వికటించి మృతి చెందిన కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని డీఎస్పీ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలు తెలిపారు. గత నెలలో మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఐదు నెలల గర్భవతి బయ్య అనూషకు అబార్షన్ చేయగా వైద్యం వికటించి మృతిచెందిన విషయం తెలిసిందే.
గర్భిణి మృతి కేసులో మొత్తం పది మందిని పోలీసులు నిందితులుగా గుర్తించారు. ఇప్పటికే మృతురాలి భర్త బయ్య నగేశ్(ఏ9), చెవుగోని గణేశ్(ఏ5), ఉప్పల సందీప్ (ఏ8) ఆర్ఎంపీ బాత్క యాదగిరి (ఏ3) అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు సూర్యాపేట టౌన్ లోని ఒమేగా ఆస్పత్రి నిర్వాహకుడు గోరంట్ల సంజీవ(ఏ1), టేకుమట్లకు చెందిన ఆర్ఎంపీ జాల జానయ్య(ఏ2), ఓమెగా ఆస్పత్రి మేనేజ్మెంట్ వీరబాయిన వేణు(ఏ6 )ను సూర్యాపేటలోని రిదిక హోటల్ వద్ద సోమవారం అరెస్టు చేశారు.
మరో మైనర్ను కూడా అరెస్టు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. బయ్యా నగేశ్, అనూష దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. మూడో సారి గర్భవతి అయింది. టెస్ట్ లు చేయగా మళ్లీ ఆడపిల్లనే అని తేలియడంతో ఆమెకు భర్త అబార్షన్ చేయించగా వైద్యం వికటించి చనిపోయిన సంగతి తెలిసిందే.