జాతీయోద్యమంలో పత్రికా రంగం

 జాతీయోద్యమంలో పత్రికా రంగం

భారతదేశంలో ఆధునిక పత్రికా రంగాన్నియురోపియన్స్​ మొదటిసారిగా ప్రారంభించారు. దీని ఫలితంగా సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రతికా రంగాన్ని లార్డ్​ మెకాలే ఫోర్త్​ ఎస్టేట్​గా అభిర్ణించారు. వాస్తవానికి బ్రిటన్​లోని కామన్​వెల్త్​ సభలో కూర్చునే గ్యాలరీ ఫోర్త్​ ఎస్టేట్​ అంటారు.  దేశంలో తొలుత పోర్చుగీసువారు 1557లో గోవాలో తొలి ముద్రణాలయం ఏర్పాటు చేశారు. ఇందులో జెసూట్స్​ ఆఫ్​ గోవా అనే పేరుతో మొదటి గ్రంథాన్ని ముద్రించారు. తర్వాత కాలంలో 1684లో బ్రిటిష్​ ఈస్టిండియా కంపెనీ బొంబాయిలో ఒక ముద్రణాలయాన్ని స్థాపించింది. ఇదిలా ఉండగా భారతదేశంలో మొదటి (ఆంగ్ల) వారపత్రిక అయిన బెంగాల్​ గెజిట్​ 1780, జనవరి 27న ప్రారంభమైంది. దీన్ని స్థాపించింది జేమ్స్​ అగస్టన్​ హిక్కి. ఇది ఒక వార, రాజకీయ, వాణిజ్య విషయక పత్రిక. 1782లో గవర్నర్​ జనరల్​ వార్​ హేస్టింగ్స్​కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హిక్కీని అరెస్టు చేశారు. తత్ఫలితంగా పత్రిక మూతపడింది. 

1784లో కలకత్తా గెజిట్​ స్థాపించబడింది. ఇదే ప్రభుత్వ అధికారిక పత్రికగా మారింది. 1799లో వెల్లస్లీ పత్రికలపై సెన్సార్​షిప్​ విధించాడు.   దక్షిణ భారతదేశంలో అధికారుల ప్రాపకంతో 1784లో మద్రాస్​ కొరియర్​ అన మొదటి పత్రిక మద్రాస్​ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇండియన్​ హెరాల్డ్స్​ పత్రిక సంపాదకుడిని ప్రభుత్వంపైనా, వేల్స్​ యువరాజుపైనా అసత్యవార్తలు రాసినందుకుగాను దేశం నుంచి పంపించివేసింది. 1799లో అన్ని పత్రికలూ తమ పత్రిక ప్రతిని ముందుగా ప్రభుత్వ తనిఖీకి సమర్పించిన తర్వాతనే ప్రచురించాలని నిబంధనను ప్రభుత్వం విధించింది. బొంబాయి రాష్ట్రంలో 1789, 1790, 1791ల్లో బాంబే హెరాల్డ్​, బాంబే కొరియర్​, బాంబే గెజిట్​ అనే పత్రికలు వరుసగా వెలువడ్డాయి. 

బ్రిటిష్​ నియంత్రణ 

సెన్సార్​షిప్​ చట్టం (1799): ఈ చట్టాన్ని లార్డ్​ వెల్లస్లీ తెచ్చాడు. దీని ప్రకారం పత్రిక దాని ప్రింటర్​, ఎడిటర్​, ప్రొప్రైటర్​ పేరును ప్రచురించాలి. ప్రచురించే ముందు ప్రతిని సెన్సార్​ సెక్రటరీకి అందజేయాలి. ఈ చట్టాన్ని 1818లో మార్క్వేస్​ హేస్టింగ్స్​ రద్దు చేశాడు. 
పత్రికా స్వేచ్ఛ/ విముక్తి చట్టం: 1835లో గవర్నర్​ జనరల్​ చార్లెస్​ మెట్​కాఫ్​ లైసెన్సింగ్​ చట్టాన్ని రద్దు చేసి, పత్రికల స్వేచ్ఛ కల్పించాడు. ఇతనికి సహాయ పడింది మెకాలే. దీనిని నిరసిస్తూ ఈస్ట్​ ఇండియా కంపెనీ అతనిని స్వదేశం పిలిపించింది. మెట్​కాఫ్​ను భారత పత్రికలకు స్వాతంత్ర్యం ప్రసాదించినవారు అంటారు.
ప్రాంతీయ భాషా పత్రికల చట్టం: దీనిని లార్డ్​ లిట్టన్​ ప్రవేశపెట్టాడు. ఇది భారతీయ పత్రికల నోరు నొక్కే చట్టం గ్యాగింగ్​ యాక్ట్​. దీనిని ఐరిష్​ పేపర్​ యాక్ట్​ ఆధారంగా తెచ్చారు. ఈ చట్టాన్ని తర్వాత రిప్పన్​ 1882లో తొలగించాడు. 
న్యూస్​ పేపర్​ యాక్ట్​ (1908): వందేమాతరం ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టబడింది. ఈ చట్టం వల్ల యుగాంతర్​, వందేమాతరం వంటి అతివాద పత్రికలు మూతపడ్డాయి. 
ఇండియన్​ ప్రెస్​ చట్టం (1910): పత్రికలు చెల్లించాల్సిన సొమ్ము డిపాజిట్లు పెంచబడ్డాయి. అభ్యంతరకరమైన అంశాలు అనే పదాన్ని నిర్వచించారు. ఈ నిర్వచనం పరిధిలోకి పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్​ సర్వెంట్లు వచ్చారు. ఈ చట్టం మొదటి ప్రపంచ యుద్ధకాలం (1914–1918)లో తీవ్రంగా అమలు చేయబడింది. 
ఇండియన్​ ప్రెస్​ చట్టం (1911): శాసనోల్లంఘన ఉద్యమకాలంలో పత్రికల మీద ఆంక్షలు విధించడానికి ఈ చట్టం చేయబడింది. ఈ చట్టం పత్రికల డిపాజిట్లు స్వాధీనం చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకిచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసినందుకు విధించే జరిమానాలు పెంచారు.
లైసెన్సింగ్​ రెగ్యులేషన్​ చట్టం (1923) :  భారతదేశంలోని పత్రికలపైన సెన్సార్​ కొనసాగించాలని థామస్​ మన్రో కమిటీ సూచన మేరకు ఈ చట్టం చేశారు. దీనిని జాన్​ ఆడమ్​ తెచ్చాడు. 

ఈ చట్టం ప్రకారం పత్రిక ప్రచురణకర్త ప్రెస్​ను ప్రారంభించే ముందు లైసెన్సు తప్పక తీసుకోవాలి. లైసెన్స్​ లేకుండా ఎవరూ పత్రికలు స్థాపించకూడదు. దీనిని ఉల్లంఘిస్తే రూ.400 జరిమానా చెల్లించాలి. ప్రచురించిన పుస్తకాలు, పత్రికల ప్రతులు ప్రభుత్వానికి సమర్పించాలి. గవర్నర్​ జర్నల్స్​కి లైసెన్సులు రద్దు చేసే అధికారం ఉంటుంది. ఈ చట్టం వల్ల రాజా రామ్మోహన్​రాయ్​ మిరాత్​ ఉల్​ అక్బర్ నిలిపివేయబడింది. 

ముఖ్యమైన పత్రికలు

దిగ్దర్శన (1818): ఇది తొలి దేశ భాషా పత్రిక. దీనికి మార్ష్​మన్​ సంపాదకత్వం వహించాడు.
సమాచార దర్పణ్​(1818): ఈ పత్రిక సంపాదకుడు కూడా మార్షమన్​. ఇది స్థానిక వార్తలను ప్రచురిస్తూ ఆధునిక ఉదారవాద భావాలను ప్రచారం చేసింది. దీనిని విలియం వార్డ్​, మార్షమన్​లు స్థాపించారు.
బంగదూత: సంపాదకుడు మంట్​ గోమరీ మార్టిన్.
టైమ్స్​ ఆఫ్​ ఇండియా: ఇది 1838లో బెన్నెట్​, కోల్​మల్​లతో ప్రచురించబడిన దిన పత్రిక. బాంబే కేంద్రంగా స్థాపించారు.
ది హిందూ పేట్రియాట్​: దీనిని 1853లో ఘోష్​ సోదరులు కలకత్తా నుంచి వెలువరించారు. సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ. 
అమృత బజార్​ (1868): ఈ పత్రికను ఘోష్​ సోదరులైన శిశిర్​కుమార్​, మోతీలాల్​ ఘోష్​లు స్థాపించారు. దీనికి మొదటి సంపాదకుడిగా శిశిర్​కుమార్​ ఘోష్​ పనిచేశారు. ఇది జెస్సోర్​లోని మగుర గ్రామం నుంచి వారపత్రికగా మొదలైంది. 1871 నాటిక పత్రిక ప్రచురణ కలకత్తాకు మారింది. 1878లో ఆంగ్ల పత్రికగా మారింది. బ్రిటిష్​వారికి, భారతీయులకు మధ్య జాతిపరమైన అంతరాన్ని ఎత్తి చూపుతూ మనం మనమే.. వాళ్లు వాళ్లే అని నినదించింది. 
ఏషియాటిక్​ మిర్రర్​ (1798): కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల వార పత్రిక. దీనిని సి.కె.బ్రూస్​, శూల్​బ్రెడ్​లు ప్రచురించారు. 
ది హిందూ: 1878లో మద్రాస్​ నుంచి వెలువడింది. దీనిని జి.సుబ్రహ్మణ్యం అయ్యర్, విజయరాఘవాచారి, కస్తూరి రంగన్​లు ప్రారంభించారు.
ద మెయిల్​: ఇది 1868లో మద్రాస్​ ప్రెసిడెన్సీలో ప్రారంభించిన మొదటి ఇంగ్లీష్​ సాయంత్రం దిన పత్రిక.