లోక్​సభకు ప్రియాంక అరంగేట్రం చేసేనా?

లోక్​సభకు ప్రియాంక అరంగేట్రం చేసేనా?

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌‌‌‌పర్సన్ సోనియా గాంధీ తన పార్లమెంటరీ కెరీర్ సిల్వర్ జూబ్లీని జరుపుకుంటున్నారు. రాయ్‌‌‌‌బరేలీలో ప్రియాంక పోటీ చేసేందుకు మార్గం సుగమం చేస్తూ  సోనియా గాంధీ రాజ్యసభకు వెళుతున్నారు. ఆమె ఈ సంవత్సరం తన పార్లమెంటరీ కెరీర్‌‌‌‌లో సిల్వర్ జూబ్లీ (1999-2024) లోక్‌‌‌‌సభ, హౌస్ ఆఫ్ ది పీపుల్‌‌‌‌లో జరుపుకుంటున్న సందర్భంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌‌‌‌పర్సన్ సోనియా గాంధీ ఎన్నికల పోరాటానికి దూరంగా ఉన్నారు. లోక్​సభకు కాకుండా, రాజ్యసభకు అంటే పెద్దల సభకు వెళ్లాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 14న రాజస్థాన్ అసెంబ్లీలో ఆమె తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

రాయ్‌‌‌‌బరేలీ నుంచి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ లోక్‌‌‌‌సభకు పోటీ చేసేందుకు, వ్యూహాత్మకంగా సోనియాగాంధీ రాజ్యసభకు పోటీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రియాంక గాంధీ పార్లమెంటరీ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. 2024లో కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి కీలకమైన ఉత్తరప్రదేశ్‌‌‌‌లో పార్టీ  పునరుజ్జీవనంపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. అమేథీలో రాహుల్ గాంధీ, రాయ్‌‌‌‌బరేలీలో ప్రియాంక గాంధీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలుచుంటారని, ఉత్తరప్రదేశ్‌‌‌‌లో పెద్ద ఎత్తున ప్రజల మద్దతును కూడగట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. యూపీ రాష్ట్ర ప్రజలతో మమేకం కావాలని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది. 

మెదక్ ​ఎంపీగా ఇందిరా గాంధీ

పండిట్ జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ మే 27, 1964న మరణించిన తర్వాత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి విజయం సాధించారు. ఇందిరా గాంధీ తన ప్రభుత్వంలో చేరాలని శాస్త్రి కోరుకున్నారు. ఈ క్రమంలో ఇందిరా గాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆమె కేంద్ర సమాచార, ప్రసార మంత్రిగా శాస్త్రి ప్రభుత్వంలో చేరారు. జనవరి 11, 1966న జరిగిన తాష్కెంట్ ఒప్పందం తర్వాత ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి విషాద మరణం అనంతరం ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా విజయం సాధించారు. 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరా గాంధీ తన భర్త ఫిరోజ్ గాంధీ ఎంపీగా ఎన్నికైన రాయ్‌‌‌‌బరేలీలో మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు.

 1950-1952 మధ్య తాత్కాలిక పార్లమెంటు సభ్యుడిగా ఉన్న ఫిరోజ్ గాంధీ 1952లో రాయ్ బరేలీ నుంచి మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయన1957లో రెండవ సార్వత్రిక ఎన్నికల్లో గెలిచాడు, కానీ 1960లో మరణించాడు. ఏడేండ్ల తర్వాత, అతని భార్య ఇందిరా గాంధీ తన మొదటి లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో రాయ్‌‌‌‌బరేలీ నుంచి పోటీ చేసింది. 1967, 1971లో ఇందిరా గాంధీ రాయ్‌‌‌‌బరేలీ నుంచి గెలిచారు. అయితే, 1977లో ఆమె రాయ్‌‌‌‌బరేలీలో రాజ్ నారాయణ్ చేతిలో ఓడిపోయింది. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, ఇందిరా గాంధీ ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని రాయ్‌‌‌‌బరేలీతోపాటు పూర్వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని మెదక్ (ఇప్పుడు తెలంగాణ) రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. రెండు స్థానాల నుంచి ఎన్నికైన ఆమె రాయ్‌‌‌‌బరేలీకి రాజీనామా చేసి మెదక్‌‌‌‌ను నిలబెట్టుకున్నారు.

ఇందిర అడుగుజాడల్లో సోనియా 

సోనియా గాంధీ తన అత్త ఇందిరా గాంధీ అడుగుజాడలను అనుసరించి ప్రియాంక గాంధీకి మార్గం సుగమం చేసేముందు 2004 నుంచి 2024 వరకు రెండు దశాబ్దాల పాటు రాయ్‌‌‌‌బరేలీకి ప్రాతినిధ్యం వహించారు. 2004లో రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు రాహుల్‌‌‌‌ను అమేథీలో పోటీ చేసేందుకు సోనియా గాంధీ రాయ్‌‌‌‌బరేలీకి వెళ్లారు.1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం సోనియాగాంధీ కొంతకాలం రాజకీయాల్లోకి దూరంగా ఉన్నారు. అయితే, సోనియా గాంధీ తనను కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకునే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీర్మానాన్ని తిరస్కరించినా.. చివరకు తన పదవిపై పునరాలోచించి రాజకీయాల్లోకి ప్రవేశించవలసి వచ్చింది. 

మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలచే రూపుదిద్దుకుని ఆ తర్వాత  పతనం అంచున ఉన్న కాంగ్రెస్‌‌‌‌ను రక్షించి మళ్లీ అధికారంలోకి తీసుకురావడం ఆమె ముందున్న కీలక లక్ష్యం. 1996-1998లో కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి హయాంలో పార్టీ విచ్ఛిన్నం అంచుకు చేరుకోవడంతో సోనియా గాంధీ పార్టీని కాపాడారు. డిసెంబరు 29, 1997న సోనియా గాంధీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. మార్చి1998లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయాలనుకున్నట్లు తెలిపారు. 1998, 1999లో కాంగ్రెస్  వెంటనే అధికారంలోకి రావడంలో విఫలమైనప్పటికీ, సోనియాగాంధీ కాంగ్రెస్‌‌‌‌ను పాతాళం నుంచి వెనక్కి లాగి, 2004లో తిరిగి అధికారంలోకి వచ్చేలా చేయడంలో విజయం సాధించారు. 

సోనియా రాజ్యసభకు..

77 ఏండ్ల సోనియా గాంధీ, ఆరోగ్యం క్షీణించడంతో రాజకీయ రణరంగంలో చురుకైన పాత్ర పోషించలేకపోతున్నారు. కాంగ్రెస్​ గెలుపు కోసం భారీగా ప్రచారం నిర్వహించి లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థితిలో సోనియా లేరు. మరో  ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నెహ్రూ–గాంధీ కుటుంబంలో ఇందిరా గాంధీ తర్వాత రాజ్యసభకు వెళ్లిన ఏకైక నేత సోనియా గాంధీ మాత్రమే. కాకపోతే  నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యులు లోక్‌‌‌‌సభకు మాత్రమే పోటీ చేశారు. అయితే, ఇందిరా గాంధీ లోక్‌‌‌‌సభకు వెళ్లే ముందు 1964-1967 వరకు రాజ్యసభలో కొంతకాలం కొనసాగారు.

2004లో యూపీఏ ఏర్పాటు

ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నానికి 272 మంది ఎంపీలు మద్దతిచ్చారని సోనియా గాంధీ ప్రకటన చేశారు. సోనియా గాంధీ ఉద్దేశ్యం ఏమిటంటే, వాజ్‌‌‌‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 272 మంది ఎంపీలు కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలకు తార్కికంగా మద్దతు ఇస్తారని భావించారు. కానీ, 1990లో బీజేపీ మద్దతుతో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన సమాజ్ వాదీ పార్టీ దివంగత ములాయం సింగ్ యాదవ్ కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి నిరాకరించారు. 

2004లో సార్వత్రిక ఎన్నికలలో అవకాశం ఉందని గ్రహించిన సోనియాగాంధీ, జైన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎంక్వైరీ మధ్యంతర నివేదిక వెల్లడికావడంతో తమిళనాడులో డీఎంకే బీజేపీకి దూరమై, చేరువైంది. అదేవిధంగా, బీజేపీకి వ్యతిరేకంగా  కూటమిని నిర్మించే ప్రయత్నంలో ఆమె లోక్ జనశక్తి పార్టీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ ఇంటికి వెళ్లారు. 2004 సార్వత్రిక ఎన్నికల తర్వాత సోనియా గాంధీ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) కు శంకుస్థాపన చేయగలిగారు.

ప్రధాని పదవిని తిరస్కరించిన సోనియా

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) నేతగా సోనియా గాంధీని కాంగ్రెస్  ఎన్నుకుంది. కానీ,  ఆశ్చర్యం ఏమిటంటే సోనియా గాంధీ విదేశీ మూలాలకు నిరసనగా కాంగ్రెస్‌‌‌‌ను విడిచిపెట్టిన శరద్ పవార్ స్వయంగా ఆమె పేరును యూపీఏ పార్లమెంటరీ పార్టీ నాయకురాలిగా ప్రతిపాదించారు, ఆ తర్వాత అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోనియా గాంధీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానం అందిన తర్వాతే సోనియాగాంధీ తనకు అధికారమే పరమావధి కాదనే విషయాన్ని చాటుకున్నారు. అధికారాన్ని త్యజించే అరుదైన చర్యలో భాగంగా సోనియా గాంధీ  ప్రధాని పదవిని తిరస్కరించారు. బదులుగా ఆమె ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్‌‌‌‌ను నామినేట్ చేశారు.  పదవుల కోసం రాజకీయ నేతలు ఎంత దూరమైనా వెళ్లగలిగిన ఈ  కాలంలో సోనియాగాంధీ రాజకీయం అంటే కేవలం పదవులు కాదని చిత్తశుద్ధితో నిరూపించారు. సోనియా గాంధీ చేసిన గొప్ప పదవీ త్యాగం చిరకాలం చరిత్రలో నిలిచిపోతుంది.  

క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్​ను ఆదుకున్న సోనియా

అత్యంత క్లిష్టమైన సమయంలో పార్టీని నడిపించాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. మార్చి 6, 1998న సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. మార్చి 15, 1998న ఆమె కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌గా ఎన్నికయ్యారు. ఆమె పార్లమెంటుకు ఎన్నిక కాకపోవడంతో శరద్ పవార్‌‌‌‌ను లోక్‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా, డాక్టర్ మన్మోహన్ సింగ్‌‌‌‌ను రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేశారు. బీజేపీ, శరద్ పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మాల అండతో  మే 1999లో  సోనియా గాంధీ విదేశీయురాలు అంటూ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఆ ముగ్గురు నాయకులపై వేటుపడింది. ఆ సమయంలో కాంగ్రెస్​ పార్టీ మొత్తం ఆమెకు అండగా నిలిచింది. 

1999లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్‌‌‌‌లోని అమేథీ నుంచి పోటీ చేశారు. కాగా, జూన్ 23, 1980న తన తమ్ముడు, సిట్టింగ్ ఎంపీ సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించిన కారణంగా జరిగిన ఉప ఎన్నిక నుంచి, మే 21, 1991న ఆయన విషాద హత్య వరకు రాజీవ్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన స్థానం అమేథీ. 1999లో అమేథీ నుంచి లోక్‌‌‌‌సభకు ఎన్నికైన తర్వాత, సోనియా గాంధీ ప్రతిపక్ష నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాలను ముందుండి నడిపించాలని నిర్ణయించుకున్నారు.


-వెంకట్ పర్స,పొలిటికల్​ అనలిస్ట్​