న్యూఢిల్లీ: ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే టెస్ట్ సిరీస్లో హోరాహోరీ పోరు ఖాయమని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. ఇరుజట్లూ బలంగా కనిపిస్తున్నా ఇండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు. స్థాయికి తగ్గ పెర్ఫామెన్స్ చేస్తే 3–2తో సిరీస్ టీమిండియా సొంతమవుతుందని మిస్టర్ డిపెండబుల్ ధీమా వ్యక్తం చేశాడు. జూన్లో న్యూజిలాండ్తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ అనంతరం ఇండియా... ఇంగ్లండ్తో వారి గడ్డపై ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఆగస్ట్– సెప్టెంబర్ మధ్యలో జరిగే ఈ సిరీస్ కోసం ఇండియా ఆల్రెడీ జట్టును కూడా ప్రకటించింది. అయితే ఆదివారం జరిగిన ఓ వెబినార్లో పాల్గొన్న రాహుల్.. తాజా టూర్పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. సిరీస్లో ఇండియా, ఇంగ్లండ్ చాన్స్లపై మాట్లాడాడు. ‘ఈసారి ఇండియా, ఇంగ్లండ్ మధ్య గొప్ప సిరీస్ చూడబోతున్నాం. ఈ సిరీస్లో ఇండియాకు చాలా ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగని ఇంగ్లండ్ బౌలింగ్ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఎలాంటి అటాక్తో బరిలోకి దిగినా ఇంగ్లిష్ జట్టు మంచి పెర్ఫామెన్స్ ఇస్తుంది. పైగా ఇంగ్లండ్ వద్ద చాలా మంది నాణ్యమైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు. వాళ్లలో ఎవరిని ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరం. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ కూడా చాలా బలంగా ఉంది. టాప్– 7లో చాలా మంచి ప్లేయర్లున్నారు. ముఖ్యంగా జో రూట్ రూపంలో ఓ వరల్డ్ క్లాస్ బ్యాట్స్మన్ అందుబాటులో ఉన్నాడు. గొప్ప ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఉండనే ఉన్నాడు. అయితే ఈ టూర్లో ఇండియా సక్సెస్ కావాలంటే అశ్విన్ అద్భుతంగా రాణించాలి. మన దగ్గర ఆడినప్పుడు స్టోక్స్ను అశ్విన్ కట్టడి చేశాడు. కానీ ఈసారి బెన్ సొంతగడ్డపై ఆడనున్నాడు. అందువల్ల వారిద్దరి మధ్య మరోసారి ఆసక్తికర పోరాటం తప్పదనిపిస్తోంది. ఈ టూర్ విషయంలో టీమిండియా.. ఆస్ట్రేలియా నుంచి ఓ విషయం నేర్చుకోవాలి. ఆసీస్ మాదిరిగా జట్టుపై నమ్మకం ఉంచాలి. టీమిండియాలో కొందరికి ఇప్పటికే ఇంగ్లండ్లో ఆడిన అనుభవం ఉండటం ఈసారి అడ్వాంటేజ్. వారి అనుభవం బ్యాటింగ్లో చాలా ఉపయోగపడుతుంది. అందువల్ల ఈసారి పోటాపోటీ తప్పదు. ఎంత పోటీ ఉన్నా ఇండియా 3–2తో సిరీస్ సొంతం చేసుకునే చాన్స్ అయితే ఉంది’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
కోహ్లీసేనకు ఆ గ్యాప్ అడ్వాంటేజ్..
డబ్ల్యూటీసీ ఫైనల్కు, ఇంగ్లండ్ సిరీస్ మధ్య దాదాపు రెండు నెలల టైమ్ ఉండటం కోహ్లీ సేనకు అడ్వాంటేజ్ కానుందని ద్రవిడ్ చెప్పాడు. ఓ సిరీస్ ప్రిపరేషన్కు ఇలాంటి చాన్స్ దొరకడం చాలా పెద్ద విషయమన్నాడు. ‘ ఇంగ్లండ్లో ఈసారి ఇండియా బాగా పెర్ఫామ్ చేస్తుందని నమ్మకంగా ఉన్నా. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కోహ్లీ సేన జూన్ 2న ఇంగ్లండ్ చేరుకుంటుంది. ఆ ఫైనల్ ముగిసిన చాలా రోజుల తర్వాత టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో రెండు నెలల వరకు గ్యాప్ ఉండగా జట్టు మొత్తం అక్కడే ఉండనుంది. సిరీస్ ప్రిపరేషన్ విషయంలో ఇంత టైమ్ దొరకడం చాలా అరుదు. ఇప్పుడిదే జట్టుకు అడ్వాంటేజ్. ఇంగ్లండ్లో ఒక విషయాన్ని ప్లేయర్లు ఎప్పటికీ మరచిపోకూడదు. 50 రన్స్ చేసిన తర్వాత కూడా క్రీజులో కుదురుకున్నామని భావించకూడదు. ఎందుకంటే ఇండియా, ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇంగ్లండ్ పరిస్థితులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాతావరణం పరీక్ష పెడుతుంది. 40 ఓవర్ల తర్వాత కూడా బాల్ అనూహ్యంగా స్వింగ్ అవుతుంది. ప్లేయర్లు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. ఇండియా, ఆసీస్లో 40–50 ఓవర్ల తర్వాత కుకాబుర్రా బాల్ సాఫ్ట్ అయిపోతుంది. బ్యాటింగ్కు అనుకూలంగా తయారవుతుంది. కానీ ఇంగ్లండ్లో వాడే డ్యూక్ బాల్ విషయంలో అలా జరగదు. క్రీజులో ఉన్నంతసేపు ఏకాగ్రతతో ఉండాలి. లేదంటే పార్ట్నర్షిప్స్ నిర్మించడం చాలా కష్టం. పరిస్థితులు వేగంగా మారిపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో ప్లేయర్లకు నేనిచ్చే సలహా ఒక్కటే. క్రీజులో గంటల తరబడి గడిపిన తర్వాత కూడా ప్లేయర్లు తమ వికెట్కు మర్యాద ఇచ్చి తీరాలి. ఏ బాల్కు ఆ బాల్ అన్నట్టుగా జాగ్రత్తగా మనుసు పెట్టి ఆడాలి. భారీ స్కోరు చేయగలిగితేనే ప్రత్యర్థికి పోటీ ఇవ్వగలం’ అని మాజీ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
తుది జట్టుపై క్లారిటీ ఉంటుంది..
ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియా ఇప్పటికే 20 మంది ప్లేయర్లతో జట్టును అనౌన్స్ చేసింది. ఇందులో పలువురు రిజర్వులుగా ఉన్నారు. అయితే, సెలెక్షన్ ప్రక్రియ చూస్తే తుది జట్టు విషయంలో మేనేజ్మెంట్ ఒక క్లారిటీతో ఉందనే విషయం అర్థమవుతోందని ద్రవిడ్ వెల్లడించాడు. ‘20 మంది ప్లేయర్ల జట్టు చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తోంది. నాణ్యమైన బ్యాట్స్మెన్, ఆల్రౌండర్లతో పాటు పర్ఫెక్ట్ బౌలింగ్ను ఎంచుకున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉండటం బలాన్ని పెంచింది. దీనిని బట్టి టీమ్ కాంబినేషన్ విషయంలో మేనేజ్మెంట్కు ఉన్న క్లారిటీని అర్థం చేసుకోవచ్చు. అశ్విన్, జడేజా ఇద్దరూ బ్యాట్, బాల్తో రాణించగలరు. అక్షర్, సుందర్ ఒకరికొకరు తగిన రీప్లేస్మెంట్స్. ఈ నలుగురు స్పిన్నర్ల వల్ల బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. అంతేకాక ఇంగ్లండ్ బయలుదేరే ముందే ఫైనల్ ఎలెవెన్పై క్లారిటీ తీసుకువస్తారు’ అని రాహుల్ పేర్కొన్నాడు.