
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: ఆధునిక పరిశోధనలకు ప్రాచీన ఇతిహాసాలు, సంస్కృతే మూలమని హైదరాబాద్యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కెమిస్ర్టీ ప్రొఫెసర్, ప్రముఖ ఆర్గానిక్ కెమిస్ర్టీ సైంటిస్ట్ దేవలపల్లి రామాచారి అన్నారు. పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ యూనివర్సిటీలో స్వామినాథన్ కీటోన్ థియరీపై మంగళవారం వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామాచారి మాట్లాడుతూ భూమిపై జీవం ఉన్నంత వరకు ఆర్గానిక్ కెమిస్ర్టీ ఉంటుందన్నారు.
స్వామినాథన్ కీటోన్స్ సిద్ధాంతంలో ముందుగా ఆయన 1966 లో బైసైక్లో అండేకేన్ అనే అస్థిపంజరాలను కనుగొన్నారని, నేడు అవే అల్కలాయిడ్ల సింథాన్లుగా పనిచేస్తున్నాయన్నారు. మహాభారతంలోని తిరిగే చేప కన్నుపై గురి పెట్టిన అర్జునుడి విన్యాసం యాన్యులేషన్ థియాబిసైక్లోనోనేన్ల సారూప్యతను నిరూపిస్తుందని వివరించారు. సైక్లో ఆక్టేన్ల సంశ్లేషణను కూడా రామసేతు నిర్మాణంతో పోల్చిన రామాచారి పరమాణు చట్రాల కచ్చితత్వాన్ని ఉదహరించారు. అనంతరం పలువురు స్టూడెంట్స్ తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకున్నారు.