హనుమకొండ, వెలుగు : త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ పాలన సాగిస్తోందని, దానిని అంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ చెప్పారు. హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో సోమవారం జరిగిన ‘తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం సదస్సు’లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా రెండేండ్ల నుంచి పోరాటం చేస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఎన్నో తప్పులు చేశాడని, అయినా రాష్ట్ర సాధన కోసం వాటిని భరించామన్నారు. కేసీఆర్ను గద్దె దించేందుకు కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ పుల్లూరి సుధాకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ప్రజా సంఘాల నాయకులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్, సోమ రామమూర్తి, సాయిని నరేందర్, చింతకింది కుమారస్వామి, మంద వీరస్వామి, బనుక సిద్దిరాజ్ యాదవ్, అకినేపల్లి వెంకటేశ్వర్లు, చిల్ల రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.