తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి: కేసీఆర్

 తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాపరెడ్డి: కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతాపరెడ్డి 125 వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు. 
పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పరిశోధనాకారుడిగా, తెలంగాణ జాతి సాహితీ  కీర్తిని దశదిశలా వ్యాపింపజేసిన, రాజకీయ సాంఘిక సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కేసీఆర్ అన్నారు. పురాణాలను, చరిత్రను, సామాజిక చైతన్యాన్ని, సాహితీ సృజనను వినూత్న కోణంలో ఆవిష్కరించి, తెలంగాణ వైభవాన్ని లోకానికి సాధికారికంగా సత్ ప్రమాణాలతో నిరూపించారని కొనియాడారు. 
'గోలకొండ పత్రిక' ద్వారా సురవరం తీసుకొచ్చిన జన చైతన్యం స్ఫూర్తిదాయకమైనదని అన్నారు. హిందూ జీవన విధానంలో అంతర్భాగమైన పండుగలు, సాంప్రదాయాల్లో నిగూఢంగా ఉన్న విలువలను శా స్త్రీయంగా వెలుగులోకి తెచ్చిన ఘనత ప్రతాపరెడ్డిదని సీఎం తెలిపారు. భారతీయ ఇతిహాసమైన రామాయణంలోని ఎన్నెన్నో తెలియని కోణాలను సోదాహరణంగా వివరించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు ప్రజల సాంఘిక చరిత్రను ఆధారాలతో సహా నమోదు చేసిన ఆ ఘనత సురవరం గారికే దక్కిందని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో పండితులు, పద్యకవులు లేరనే మాటను సవాలుగా తీసుకొని 'గోలకొండ కవుల సంచిక'ను ప్రత్యేకంగా ముద్రించారాన్నారు. తద్వారా తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగరేసి తెలంగాణ సాహితీ వైభవాన్ని నిరూపించిన అచ్చమైన తెలంగాణావాది , తెలంగాణ స్ఫూర్తిని రగిలించిన తేజోమూర్తి, సురవరం ప్రతాపరెడ్డి అని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు.