
- అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా ఐదోరోజూ ఆందోళనలు
- బలగాలు, నిరసనకారులతో రణరంగంగా మారిన వీధులు
- నిరసనల మాటున ఆపిల్ స్టోర్, ఇతర షాపులు లూటీ
- 96 మంది అరెస్ట్.. ఇతర నగరాలకూ పాకిన నిరసనలు
- ఆందోళనలు చేస్తున్నవారు విదేశీ శత్రువులు: ట్రంప్
లాస్ఏంజెల్స్: అక్రమ వలసదారుల ఏరివేతకు వ్యతిరేకంగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో నెలకొన్న ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. శుక్రవారం ఓ యూనియన్ నేత అరెస్ట్తో మొదలైన నిరసనలు.. మంగళవారం ఐదోరోజు కూడా కొనసాగాయి. ట్రంప్ ఆదేశాలతో పెద్దసంఖ్యలో పోలీసులు, నేషనల్ గార్డ్స్, మెరైన్లు ఓ వైపు మోహరించగా.. మరో వైపు వేలాదిమంది నిరసనకారులు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంకావడంతో వీధులన్నీ రణరంగంగా మారాయి. డౌన్టౌన్లో చాలామంది ఆందోళనకారులు మెక్సికో, గ్వాటెమాలా, ఇతర జెండాలతో కదం తొక్కారు. ఇమిగ్రేషన్కస్టమ్స్ఎన్ఫోర్సమెంట్ (ఐసీఈ) ఏరివేత కార్యక్రమాన్ని నిరసిస్తూ ఫెడరల్ భవనం వద్ద వందలాది మంది గుమికూడి నిరసనలు తెలిపారు. దాదాపు వందమంది ఫ్రీ వేపైకి చేరుకొని బ్లాక్ చేయగా.. లాస్ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడకు చేరుకొని వారిని చెదరగొట్టింది. దాదాపు 96 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
కర్ఫ్యూ విధించిన మేయర్
నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో డౌన్టౌన్లోని పలు ప్రాంతాల్లో అత్యవసర కర్ఫ్యూ విధిస్తున్నట్టు లాస్ ఏంజెల్స్ మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు. ఇది మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటుందని తెలిపారు. డౌన్ టౌన్ను ధ్వంసం చేసి దుకాణాలను లూటీ చేసినవారు మూల్యం చెల్లించుకోక తప్పదని కరెన్బాస్ హెచ్చరించారు. కాగా, నియమిత ప్రాంతాల్లో నివసించేవారు, నిరాశ్రయులైన వ్యక్తులు, మీడియా, అత్యవసర సిబ్బందికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని పోలీస్ డిపార్ట్మెంట్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ తెలిపారు.
ఇతర రాష్ట్రాలకు పాకిన నిరసనలు
లాస్ఏంజెల్స్లో మొదలైన నిరసనలు మిగతా రాష్ట్రాలకు విస్తరించాయి. మంగళవారం న్యూయార్క్లో కూడా ఇమిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. అనేక వేల మంది మాన్హట్టన్ వీధుల గుండా కవాతు చేశారు. అలాగే, కాలిఫోర్నియాలోని శాన్ఫ్రాన్సిస్కో, శాంతా అనా, టెక్సాస్లోని డల్లాస్, ఆస్టిన్, సియాటెల్, లూయీ విల్లే, శాన్ ఆంటోనియో, షికాగో నగరాల్లోనూ ఆందోళనకారులు రెచ్చిపోయారు. నిరసనలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు నిరసనకారులను మరింత రెచ్చిపోయేలా చేశాయి.
బలగాల మోహరింపును సమర్థించుకున్న ట్రంప్
లాస్ఏంజెల్స్లో నిరసనలను అదుపుచేసేందుకు 4వేల మంది నేషనల్ గార్డ్స్, 700 మంది మెరైన్లను పంపడాన్ని అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకున్నారు. ఆందోళనకారులను జంతువులు, విదేశీ శత్రువులని విమర్శించారు. అమెరికా 250వ ఆర్మీడే సందర్భంగా పోర్ట్ బ్రాగ్లోని ఆర్మీ బేస్లో నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. అక్రమ వలసదారుల నుంచి లాస్ఏంజెల్స్కు విముక్తి కల్పిస్తామని చెప్పారు. విదేశీ శత్రువులు దేశంలోని ఓ నగరాన్ని ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. లాస్ ఏంజెల్స్ను మళ్లీ సురక్షిత నగరంగా మారుస్తామని చెప్పారు.
ఎల్ఏలో 9 లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్
అమెరికాలోనే లాస్ ఏంజెల్స్ అత్యంత విలాసవంతమైన నగరంగా పేరొందింది. అత్యంత సంపన్నులు ఇక్కడ నివాసముంటున్నారు. లాస్ఏంజెల్స్ ప్రధాన నగరంలో 39 లక్షల మంది ప్రజలు ఉంటే.. వీరిలో 35శాతం మంది ప్రవాసులే. దాదాపు 9 లక్షల మంది వలసదారుల వద్ద ఎలాంటి పత్రాలు లేవు.అందువల్లే నగరంలో అక్రమ వలసదారుల ఏరివేతపై తీవ్ర వ్యతిరేకత ఎదురైనట్లు అధికారులు భావిస్తున్నారు.
యాపిల్ స్టోర్ లూటీ
నిరసనల మాటున లాస్ఏంజెల్స్లో పలువురు ఆందోళనకారులు చేతివాటం చూపారు. యాపిల్ స్టోర్తో సహా పలు షాపుల్లో చొరబడ్డారు. అందిన వస్తువులను లూటీ చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారాయి. మాస్క్లు వేసుకున్న కొందరు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. గ్యాడ్జెట్లను ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టుకు..
తనను సంప్రదించకుండా నేషనల్ గార్డ్స్మోహరింపు లెక్కలేనితనమని, స్థానిక బలగాలకు అవమానకరమని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ వ్యాఖ్యానించా రు. కేంద్ర బలగాల మోహరింపుపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. దళాలను ఏ విధమైన పోలీసింగ్ ఫోర్స్గా ఉపయోగించకుండా నిరోధించాల ని, వారిని ఫెడరల్భవనాలకు కాపలాగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఇంజక్షన్ జారీ చేయాలని కోరింది. ట్రంప్తోపాటు రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్.. అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై జిల్లా జడ్జి చార్లెస్ బ్రేయర్ గురువారం విచారణ చేపట్టనున్నారు.