
నిజామాబాద్, వెలుగు : రాష్ట్రంలో నిర్మించిన రైతువేదికలపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ప్రొటోకాల్ వివాదం రగులుతోంది. వేదికల నిర్మాణాలకు సెంట్రల్గవర్నమెంట్ ఫండ్స్ వాడుకుంటున్నా ఎక్కడా ఆ విషయాన్ని స్టేట్ గవర్నమెంట్ చెప్పడంలేదు. పైగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొవిడ్ వ్యాక్సిన్ను పూర్తిగా కేంద్రమే ఉచితంగా అందిస్తోంది. పేదలకు గరీబ్ కళ్యాణ్ యోజన పేర ఉచితంగా రేషన్ సప్లై చేస్తున్నది. స్టేట్ గవర్నమెంట్ గొప్పగా చెప్పుకుంటున్న డబుల్ బెడ్రూం స్కీమ్కు కూడా సెంట్రల్ ఫండ్స్ ఇస్తోంది. ఇలా అనేక స్కీమ్లలో సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉన్నా ఎక్కడా కేసీఆర్ సర్కారు ఆ విషయాన్ని చెప్పకుండా ఇవన్నీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోంది. ఈ విషయంలో బీజేపీ అనేక సందర్భాల్లో నిరసన ప్రకటించింది. స్టేట్ గవర్నమెంట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సెంట్రల్గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తున్న స్కీమ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని అంటోంది.
రైతువేదికలకు సెంట్రల్ ఫండ్స్రూ. 60 కోట్లు
తాజాగా రైతువేదికలకు సంబంధించి బీజేపీ ఆందోళన బాట పట్టింది. క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించారు. ఇందుకు ఉపాధిహామీ పథకం నుంచి ఫండ్స్వాడుకున్నారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గాల నుంచి బీజేపీ మెంబర్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి పరిధిలో మొత్తం 566 రైతు వేదికలను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది. నిజామాబాద్ లోకసభ పరిధిలో మొత్తం 177 వేదికలు నిర్మించగా నిజామాబాద్ జిల్లాలో 106, జగిత్యాల జిల్లాలో 71 ఉన్నాయి. ఆదిలాబాద్ లోకసభ పరిధిలో 243 రైతువేదికలు కట్టారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో 101, నిర్మల్ జిల్లాలో 72, ఆసిఫాబాద్ జిల్లాలో 71 వేదికలు నిర్మించారు. కరీంనగర్పరిధిలో 143 వేదికలు నిర్మించగా.. 75 కరీంనగర్ జిల్లాలో, 71 సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నాయి. ఒక్కో రైతువేదికను రూ. 22 లక్షలతో కడుతుండగా, ఇందులో రూ. 10 లక్షలు కేంద్రం వాటా. ఈ లెక్కన మూడు లోకసభ సెగ్మెంట్ల పరిధిలో రూ. 60.30 కోట్ల సెంట్రల్ ఫండ్స్ వాడుకున్నారు. అయితే రైతువేదికల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఎంపీలను మొక్కుబడిగా ఆహ్వానిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకుంటున్నారు. ఎంపీలు ఇతర పనుల్లో బిజీగా ఉన్నప్పుడు, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శిలాఫలకాల మీద తమ పేర్లున్నా .. ఎంపీలు మాత్రం ప్రారంభోత్సవాలకు అటెండ్ కాలేకపోతున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎంపీలు పాల్గొన్నప్పుడే కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు అంటున్నారు. రైతువేదికల మీద సీఏం కేసీఆర్తోపాటు లోకల్ ఎమ్మెల్యే ఫొటో పెడుతున్నారు. సగం ఫండ్స్సెంట్రల్ నుంచే వాడుకుంటున్నా ప్రధాని మోడీ ఫొటో ఏర్పాటు చేయడం లేదని బీజేపీ లీడర్లు విమర్శిస్తున్నారు.
ఖాకీ పహారాలో ఓపెనింగ్స్..
ఇటీవల బీజేపీ క్యాడర్ నుంచి నిరసనలు పెరగడంతో పోలీసుల పహారా నడుమ రైతువేదికల ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వేదికల మీద ప్రధాని , ఎంపీల ఫోటోలు పెట్టాలని డిమాండ్ చేస్తూ కొన్ని చోట్ల ప్రారంభోత్సవాలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో బందోబస్తు పెంచడంతో పాటు ఆ ఏరియాల్లో బీజేపీ లీడర్లను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీజేపీ లీడర్లను ముందుగానే అరెస్టు చేసి.. భారీగా పోలీసు బలగాలను దింపి సోమవారం రైతువేదికను ప్రారంభించారు.
ఆఫీసర్లు ప్రొటోకాల్ పాటించాలె
ఆఫీసర్లు పక్షపాతం లేకుండా పని చేయాలే. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని గుర్తు పెట్టుకోవాలే. అరెస్టులు చేస్తే ఉద్యమంఉప్పెనలా మారుతుంది. ఎంపీలకు సంబంధించి ప్రొటోకాల్పాటించకపోతే సెంట్రల్గవర్నమెంట్ యాక్షన్ ఉంటుంది. కేంద్రప్రభుత్వ నిధులను వాడుకుంటూ ప్రధానిని విస్మరించడం తగదు.
- నిజామాబాద్ ఎంపీ అర్వింద్
ప్రధాని, ఎంపీ ఫొటో పెట్టాలి
రైతువేదికల మీద ప్రధాని మోడీ, ఎంపీ అర్వింద్ఫోటోలను ఏర్పాటు చేయాలి. కేంద్ర నిధులు వాడుకుంటున్నా ఆ క్రెడిట్ ఇవ్వడంలేదు. ప్రొటోకాల్ పాటించకపోతే స్టేట్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పోరాడుతాం. ఎంపీ ఫోటో ఏర్పాటు చేసేదాక అధికారులపై ఒత్తిడి తెస్తం.
- వినయ్రెడ్డి , ఆర్మూర్ బీజేపీ ఇన్చార్జి