- పీఆర్టియు జిల్లా అధ్యక్షులు మోహన్రెడ్డి
ఎడపల్లి, వెలుగు: ఎడపల్లి మండలంలోని వడ్డెర కాలనీలో ఉన్న ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు భూపతి రాజుపై మండల విద్యాశాఖ అధికారి గాలప్ప దాడి చేసి , తానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం శోచనీయమని, ఇది పూర్తిగా కక్షసాధింపు చర్య అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్నారు.
బుధవారం ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయుడు తప్పు చేస్తే ముందుగా జిల్లా అధికారికి ఫిర్యాదు చేయాలని కానీ ఎంఈఓ గాలప్ప తనపై దాడి జరిగిందని ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సమంజసం కాదన్నారు.
ఉపాధ్యాయుడిపై కక్ష గట్టిన ఎంఈఓ ఆయనకు ఇటీవల మెమో జారీ చేశారని.. అయినా ఉరుకోకుండా కక్షపూరితంగా తిరిగి ఇదే పాఠశాలకు తనిఖీకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉన్నా.. సమయానికి పాఠశాలకు రావడంలేదని ఉపాధ్యాయుడిని వేధించడం కక్షసాధింపు చర్యలకు నిదర్శనమనన్నారు.
ఉపాధ్యాయుడిపై పోలీసు కేసు విషయంలో పునరాలోచించాలని, ఇదే పద్ధతి గనుక కొనసాగితే ఎంఈఓ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంఈఓగా విధులు నిర్వహించలేకపోతే స్వచ్ఛందంగా విధుల నుంచి తప్పుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టియు జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, పిఆర్టియు జనరల్ సెక్రటరీ కిషన్, పిఆర్టియు నాయకులు సాయిరెడ్డి, బాలేషం, తదితరులు పాల్గొన్నారు.
