చైనాతో గొడవలు మరియు భారత అంతర్గత సమాచారాన్ని దొంగిలిస్తున్నారనే కారణంతో భారత ప్రభుత్వం సెప్టెంబర్లో దాదాపు రెండొందలకు పైగా యాప్లను బ్యాన్ చేసింది. వాటిలో పబ్జీ కూడా ఒకటి. పబ్జీకి చెందిన PUBG మొబైల్ మరియు PUBG లైట్లను నిషేధించారు. భారత్లో ఈ యాప్లకు విపరీతమైన ఆదరణ ఉంది. అయితే సెప్టెంబర్లో విధించిన నిషేధాన్ని అనుసరించి శుక్రవారం అక్టోబర్ 30 నుంచి భారతీయులకు పబ్జీ గేమ్లోకి యాక్సెస్ ఉండదు. కాగా.. ఇప్పటికే ఈ రెండు ఆటలను ఇన్స్టాల్ చేసుకున్న వారి ఫోన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ కింద ఈ నిషేధం విధించబడింది. దేశం యొక్క ‘సార్వభౌమాధికారం మరియు సమగ్రత కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం నుంచి పబ్జీ యాక్సెస్ లేదనే విషయం గురించి పబ్జీ తన అధికారిక ఫేస్బుక్ పేజీలో తెలిపింది. దేశంలో ప్రస్తుతమున్నPUBG మొబైల్ నోర్డిక్ మ్యాప్: లివిక్ మరియు PUBG మొబైల్ ఈ రెండింటికి సంబంధించిన అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు పబ్జీ ప్రకటించింది.
‘వినియోగదారుల డేటాను రక్షించడం మా బాధ్యత. మేం ఎల్లప్పుడూ సమాచార రక్షణ చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉన్నాం. మా నియమాల ప్రకారం.. వినియోగదారులందరి గేమ్ప్లే సమాచారం పారదర్శకంగా ప్రాసెస్ చేయబడుతుంది. ఈ నిషేధంపై మేం తీవ్రంగా చింతిస్తున్నాము. PUBG మొబైల్పై మీ మద్దతు మరియు ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని PUBG మొబైల్ తన ఫేస్బుక్ పేజీలో తెలిపింది.
‘పబ్జీ నిషేధం కోటి మంది భారతీయ మొబైల్ మరియు ఇంటర్నెట్ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుంది’ అని ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా మార్పుల ఫలితంగా.. PUBGకి సంబంధించిన ఎటువంటి యాప్లు భారతదేశంలో అందుబాటులో ఉండవు. కాగా.. వినియోగదారులు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (VPN)ను ఉపయోగించి ఈ ఆటను కొనసాగిస్తారేమో అనే అనుమానాలున్నాయి.