కరోనా చికిత్స కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్ లోన్లు ఇస్తామని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. తమ ఎస్బీఐ బ్యాంకులే కాక అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈ రుణాలు మంజూరు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. పర్సనల్ లోన్ కింద కనీసం రూ. 25,000 గరిష్ఠంగా రూ. 5 లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు. కరోనా చికిత్స కోసం తీసుకునే పర్సనల్ లోన పై ఎస్బీఐ కేవలం 8 శాతం వడ్డీ వసూలు చేయాలని నిర్ణయించిందని, ఇతర బ్యాంకుల వడ్డీ భిన్నంగా ఉండొచ్చన్నారు. అత్యవసర వ్యక్తిగత రుణ పథకం (ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్-ECLGS) కింద కరోనా చికిత్సకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) ఛైర్మన్ రాజ్ కిరణ్ రాయ్, ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతాతో కలిసి ఎస్బీఐ ఛైర్మన్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.
