15 కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా

15 కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా

న్యూఢిల్లీ: రాజకీయపార్టీలకు సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలను జారీచేసింది. ఎన్నికల్లో పోటీచేస్తున్న కేండిడేట్లకు  సంబంధించి పెండింగ్​లో ఉన్న  క్రిమినల్​చరిత్ర వివరాలను  బయటపెట్టాలని ఆదేశించింది.  పార్టీల వెబ్ సైట్లలో  వీటిని అప్​లోడ్​ చేయాలని  ఆదేశించింది.  నేర చరిత్ర ఉన్నా.. వాళ్లను ఎందుకు  ఎంపిక చేశారో కూడా వివరణ  ఇవ్వాలని పార్టీలను చెప్పింది. కేవలం అభ్యర్థులు గెలుస్తారన్న నమ్మకం కాకుండా.. వాళ్ల అర్హత, మెరిట్​ ఏంటో  నిరూపించుకోవాలంది.  జస్టిస్​ రోహింటన్​ ఫాలి నారీమన్​ ఆధ్వర్యంలోని బెంచ్​ ఈమేరకు  తీర్పు చెప్పింది.

కేసు కథేంటి?

ఎన్నికల్లో పోటీచేయడానికి ముందు కేండిడేట్లు తమపై ఉన్న క్రిమినల్  చరిత్రను ప్రకటించాలని ఐదుగురు సభ్యుల కానిస్టిట్యూషనల్​ బెంచ్ 2018 సెప్టెంబరు 25న తీర్పు చెప్పింది.   కేండిడేట్ల క్రిమినల్​ కేసులకు సంబంధించిన వివరాలను ప్రింట్​, ఎలక్ట్రానిక్​  మీడియాల ద్వారా ప్రచారం చేయాలని  సుప్రీంకోర్టు పార్టీలను ఆదేశించింది.  పెద్ద కోర్టు తీర్పును పార్టీలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ వేశారు.

కేండిడేట్ల నేర చరిత్ర పబ్లిష్​ చేసే అంశంపై ఫారం‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సవరిస్తూ  రాజకీయ పార్టీలకు,  అభ్యర్థులకు 2018, అక్టోబరు 10 ఎలక్షన్​ కమిషన్​ నోటిఫికేషన్​ జారీచేసింది.  ఎలక్షన్​ సింబల్​ ఆర్డర్​కు గాని,  ఎలక్షన్​ కోడ్​ ఆఫ్​ కండక్ట్​కు గానీ  ఈసీ సవరణలు చేయనందువల్ల    ఎలక్షన్​ కమిషన్​ జారీచేసిన సవరణలకు ఎలాంటి చట్టబద్ధత లేదని కూడా అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​  తరపున వాదిస్తున్న  సీనియర్​ లాయర్​  గోపాల్​ శంకరనారాయణన్​ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈమేరకు ఈ  కీలక జడ్జిమెంట్​ను ఇచ్చింది.

ఈసీ ఏమన్నదంటే?…

ఎంపీలపై  పెండింగ్​లో ఉన్న క్రిమినల్​ కేసులు పెరిగిపోవడం ఆందోళనకరంగా ఉందని ఈసీ  సుప్రీంకోర్టుకు తెలిపింది.   43 శాతం మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఈసీ తెలిపింది. అభ్యర్థుల క్రిమినల్​చరిత్ర  వివరాలను పార్టీలు  తప్పనిసరిగా తమ వెబ్​సైట్లలో అప్​లోడ్​ చేయాలన్న పిటిషనర్​ సూచనను ఈసీ అంగీకరించింది.

కీలక కామెంట్స్​ ఇవే

గత 4 లోక్​సభ ఎన్నికల్ని పరిశీలిస్తే  రాజకీయాల్లో నేర ప్రవృత్తి  పెరుగుతోంది.అభ్యర్థుల క్రిమినల్​ కేసుల చరిత్ర వివరాలను పార్టీ వెబ్​సైట్లలో పెట్టాలి. ఫేస్​బుక్​, ట్విటర్​ లాంటి సోషల్​ మీడియా ఫ్లాట్​ఫాంలతోపాటు పేపర్లలో (ఒక లోకల్​, మరొక నేషనల్​ పేపర్​) ఈ వివరాలను పబ్లిష్​ చేయాలి. నేరచరిత్ర ఉన్న కేండిడేట్స్​ను ఎందుకు ఎంపిక చేశారన్న దానిపై కచ్చితమైన కారణాలు తెలపాలి. క్రిమినల్​ హిస్టరీ ఉన్న అభ్యర్థుల వివరాలను 72 గంటల్లో ఎలక్షన్​ కమిషన్​కు రిపోర్ట్​ ఇవ్వాలి.సుప్రీం ఆదేశాలకు తూట్లుపొడిస్తే ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని ఈసీని  పెద్ద కోర్టు ఆదేశించింది.

15 కేసులున్న వ్యక్తికి మంత్రి పదవా?

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉంటే వాటి వివరాలను పార్టీ వెబ్ సైట్ లో పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలను బీజేపీ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కర్నాటకలో మైనింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆనంద్ సింగ్ ను మంత్రిగా అపాయింట్ చేశారని కాంగ్రెస్ నేత రణదీప్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌సుర్జేవాలా గురువారం ట్వీట్ చేశారు. బళ్లారి గ్యాంగ్ ను కాపాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ,  బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. నేర చరిత్ర ఉన్నవారికి ఎందుకు టికెట్లు ఇచ్చారో కారణాలు చెప్పాలని సుప్రీంకోర్టు చెబుతోందని,అయితే అలాంటి వారికి బీజేపీ మంత్రి పదవులు కట్టబెడుతోందని విమర్శించారు. ఈ విషయంలో  ప్రధాని నరేంద్ర మోడీ, కర్నాటక సీఎం యడియూరప్పకు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని  ట్వీట్ లో పేర్కొన్నారు. నేరచరిత కలిగిన అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాము స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ అన్నారు. కర్నాటకలో 15 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆనంద్ సింగ్ ను మంత్రిగా నియమించారని ఆయన
ఆరోపించారు.