
ఇస్లామాబాద్: పుల్వామా దాడి తర్వాత పాక్ పై భారత ప్రభుత్వం సీరియస్ అవడంతో దాయాది దేశానికి భయం పట్టుకుంది. భారత్ ఎక్కడ అటాక్ కు దిగుతుందోనన్న ఆందోళనతో యూన్ వద్దకు పరుగులు పెట్టింది. తమను ఆదుకోవాలంటూ పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనీ గుటెరస్ కు లేఖ రాశారు.
పాక్ పై భారత్ దూకుడు ప్రదర్శిస్తోందని, ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయని లేఖలో చెప్పారు. భద్రత పరిస్థితులు వేగంగా క్షీణిస్తున్నాయని, భారత్ రక్షణ దళాల తీరు తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తక్షణం ఐక్య రాజ్యసమితి కలగజేసుకుని, ఉద్రిక్తతలను తగ్గించాలని ఖురేషీ కోరారు.
రాజకీయాల కోసమేనని భారత్ పై నిందలు
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసింది కశ్మీరీనే చేశాడని క్లియర్ గా తెలుస్తున్నా, పాక్ పై నిందలు వేయడం దారుణమని ఖురేషీ అన్నారు. భారత్ లో రాజకీయ కారణాలతోనే పాక్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల ముందు కావాలనే ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారాయన.
అలా చేస్తే పెద్ద తప్పు చేసినట్లే
భారత్ ఇప్పటికే సింధూ జలాల ఒప్పందాన్ని బ్రేక్ చేస్తామని పరోక్ష హెచ్చరికలు చేస్తోందని, అలా చేస్తే పెద్ద తప్పు చేసినట్లేనని ఖురేషీ అన్నారు. యూఎన్ వెంటనే కలగజేసుకుని ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని లేఖలో కోరారు. పుల్వామా ఉగ్రదాడిపై క్రెడిబుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని భారత్ కు సూచించాలని అన్నారు. పరిస్థితులు చక్కదిద్దడానికి పాకిస్థాన్, కశ్మీరీలతో భారత ప్రభుత్వం చర్చలు వెళ్లాల్సిందిగా చెప్పాలని యూఎన్ చీఫ్ ను కోరారు.

