- ఈ సిటీల్లో జాబ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న టెక్ ఉద్యోగులు
- ఢిల్లీలో పొల్యూషన్..ఇక్కడ జాబ్ చేయడంపై తక్కువ ఆసక్తి
- కేటనాన్ సర్వేలో వెల్లడి
బిజినెస్ డెస్క్, వెలుగు: పుణె, హైదరాబాద్లలో జాబ్స్ చేసేందుకు టెక్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వే ఒకటి వెల్లడించింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, మిగిలిన మెట్రో సిటీలతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండడం వలన, క్వాలిటీ లైఫ్కి ఢోకా లేకపోవడం వలన పుణెలో జాబ్ చేసేందుకు టెక్ ఉద్యోగులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇతర మెట్రోల కంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉండడం వలన హైదరాబాద్ను కూడా ఎంచుకుంటున్నారు. ఈ రెండు సిటీలు టెక్ ప్రొఫెషనల్స్ లిస్టులో టాప్లో ఉన్నాయి. ‘విచ్ సిటీ నెక్స్ట్? 2022’ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్లో గ్లోబల్ రిక్రూట్మెంట్ కంపెనీ కేటనాన్ ఈ విషయాలను వెల్లడించింది. ఇతర సిటీలతో పోలిస్తే బెంగళూరులో టెక్ ఉద్యోగులకు ఎక్కువ సాలరీ దక్కుతోందని తెలిపింది. చెన్నైలో టాప్ ఐటీ కంపెనీల ఆఫీసులు ఉన్నాయని, ఈ సిటీ దేశంలో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) కు హబ్గా మారిందని పేర్కొంది. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు ఈ సిటీలో దొరికే ఫుడ్కి అడ్జెస్ట్ కావడంలో ఇబ్బంది పడుతున్నారని కేటనాన్ రిపోర్ట్ పేర్కొంది. మొత్తం 1,200 మందికి పైగా టెక్ ప్రొఫెషనల్స్ నుంచి అభిప్రాయాలను సేకరించి, లింక్డిన్, ఇండీడ్, నౌకరీ డాట్ కామ్ వంటి ప్లాట్పామ్లలోని మరో 15 వేలకు పైగా టెక్ ప్రొఫెషనల్స్ ప్రొఫైల్స్ను విశ్లేషించి ఈ రిపోర్ట్ తయారు చేశామని కేటనాన్ వివరించింది.
వర్క్–లైఫ్ బ్యాలెన్స్కే ఎక్కువ ప్రయారిటీ..
దేశంలో కమర్షియల్ క్యాపిటల్గా పేరు పొందిన ముంబైలో టెక్ ఉద్యోగుల్లో మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు బెంగళూరు తర్వాత బెస్ట్ సాలరీ దొరుకుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఎక్కువ సాలరీ దొరుకుతున్నా ఢిల్లీలో పనిచేసేందుకు టెక్ ప్రొఫెషనల్స్ తక్కువ ఆసక్తి చూపించారని పేర్కొంది. పొల్యూషన్ ఎక్కువగా ఉండడం, సేఫ్టీ భయాలతోనే ఈ సిటీలో జాబ్ చేసేందుకు తక్కువ ఆసక్తి చూపిస్తున్నారని వివరించింది. ‘ ప్రస్తుతం టెక్ ఉద్యోగులు కేవలం జాబ్ కోసం మాత్రమే చూడడం లేదు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ బాగుండేలా, క్వాలిటీ లైఫ్ అందేలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండేలా చూస్తున్నారు. అందుకే ఉద్యోగులు జాబ్ ఆఫర్ను అంగీకరించే ముందు ఏ సిటీలో జాబ్ అనేది కీలకంగా ఉంది’ అని కేటనాన్ ఎండీ (ఆసియా–పసిఫిక్) గౌరవ్ చట్టూర్
పేర్కొన్నారు.
దూసుకుపోతున్న ఐటీ సెక్టార్..
దేశ ఐటీ సెక్టార్ రెవెన్యూ గత కొన్నేళ్ల నుంచి నిలకడగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే ఈ సెక్టార్ రెవెన్యూ 15.5 % (ఏడాది ప్రాతిపదికన) పెరిగి రూ. 18.16 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంకో నాలుగేళ్లలో ఈ ఇండస్ట్రీ రెవెన్యూ రూ. 28 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐదు లక్షల ఉద్యోగాలను ఈ ఇండస్ట్రీ క్రియేట్ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఇంతలా ఉద్యోగాలను ఐటీ సెక్టార్ క్రియేట్ చేయడం ఇదే మొదటిసారి. దేశం నుంచి ఐటీ ఎగుమతులు గత కొంత కాలంగా పెరుగుతున్నాయి కూడా. 2020–21 లో ఈ ఇండస్ట్రీ రూ.12 లక్షల కోట్ల విలువైన సర్వీస్లను ఎగుమతి చేసింది. 2025 నాటికి దేశంలోని డిజిటల్ సెక్టార్ వాల్యూ ట్రిలియన్ డాలర్ల (రూ. 80 లక్షల కోట్ల) కు చేరుకుంటుందని అంచనా. 2021, సెప్టెంబర్ నుంచి 2022, ఫిబ్రవరి మధ్య దేశ టెక్ సెక్టార్లో నియామకాలు 74 % (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయని ఎనలిస్టులు చెబుతున్నారు . యూఎస్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ సుమారు 80 కి చేరుకోవడంతో టెక్ కంపెనీలు ఎక్కువగా లాభపడుతున్నాయి. దేశం నుంచి ఐటీ ఎగుమతుల్లో మెజార్టీ వాటా యూఎస్కే వెళుతోంది. దేశ టెక్, బీపీఎం సర్వీస్ల ఎగుమతుల్లో 62 % వాటా యూఎస్కు వెళుతోందని, రెండో ప్లేస్లో యూకే ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. అందుకే చాలా ఎంఎన్సీ కంపెనీలు దేశంలో తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. టాలెంట్ ఉన్న ఉద్యోగులు దొరుకుతుండడం, ఖర్చు తక్కువ అవుతుండడంతో దేశంలో తమ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకొస్తున్నాయి.