- ముంబైపై పంజా విసిరిన పంజాబ్
- 9 వికెట్లతో పంజాబ్ గ్రాండ్ విక్టరీ
- రాణించిన లోకేశ్, గేల్
- అదరగొట్టిన షమీ, బిష్నోయ్
- ఇండియన్స్ 131/6కే పరిమితం
- రోహిత్ హాఫ్ సెంచరీ వృథా
159, 152, 150, 137, 131 ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ స్కోర్లు. రోజులు గడుస్తున్నా... ప్రత్యర్థులు మారుతున్నా డిఫెండింగ్ చాంప్ చెత్త బ్యాటింగ్ ఏమాత్రం మారకుండా మరింత దిగజారుతోంది..! టాపార్డర్లో ఎవరో ఒకరు రాణిస్తున్నా.. మిడిలార్డర్ ఫెయిల్యూర్తో చిన్న టార్గెట్లకే పరిమితమవుతోంది..! హిట్మ్యాన్ రోహిత్ శర్మ (52 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) సీజన్లో ఫస్ట్ హాఫ్ సెంచరీ కొట్టినా.. అతను 18వ ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా కూడా మరోసారి ఆశించిన స్కోరు చేయలేకపోయింది..! పంజాబ్ బౌలర్లు మహ్మద్ షమీ (2/21), రవి బిష్నోయ్ (2/21), దీపక్ హుడా (1/15) దెబ్బకు ఈ సీజన్లో తమ లోయెస్ట్ స్కోరు చేసింది..! బౌలర్ల సూపర్ పెర్ఫామెన్స్కు తోడు లోకేశ్ రాహుల్ (52 బాల్స్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్), క్రిస్ గేల్ (35 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 నాటౌట్) మెరుపులతో ఈజీగా గెలిచిన కింగ్స్ టీమ్ మళ్లీ గెలుపు బాట పట్టింది..! వరుసగా రెండో ఓటమి, ఓవరాల్గా ఐదింటిలో మూడు పరాజయాలతో డిఫెండింగ్ చాంప్ ముంబై డీలా పడింది..!
చెన్నై: హ్యాట్రిక్ పరాజయాల తర్వాత పంజాబ్ కింగ్స్ అద్భుతంగా పుంజుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్తో చెలరేగి ముంబైపై పంజా విసిరింది. శుక్రవారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో ఆటీమ్ను చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది. రోహిత్తో పాటు సూర్యకుమార్ (27 బాల్స్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో 33), కీరన్ పొలార్డ్ (16 నాటౌట్) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. అనంతరం లోకేశ్, గేల్తో పాటు మయాంక్ అగర్వాల్ (25) కూడా రాణించడంతో పంజాబ్ 17.4 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 132 రన్స్ చేసి ఘన విజయం ఖాతాలో వేసుకుంది. లోకేశ్ రాహుల్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రోహిత్ మెరిసినా..
పవర్ ప్లేలో 21/1.. పది ఓవర్లకు 49/2 లీగ్లో మోస్ట్ పవర్ఫుల్ బ్యాటింగ్తో కూడిన ముంబై ఆట సాగిన తీరిది. మధ్యలో కాస్త వేగం పెంచినా.. స్లాగ్ ఓవర్లలో మళ్లీ తడబడడంతో మరోసారి చిన్న టార్గెట్కే పరిమితం అయింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (3) మళ్లీ నిరాశ పరిచాడు. హుడా వేసిన సెకండ్ ఓవర్లోనే హెన్రిక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ జాగ్రత్తగా బ్యాటింగ్ చేయగా.. వన్డౌన్కు ప్రమోటైన యంగ్స్టర్ ఇషాన్ కిషన్ (17 బాల్స్లో 6)కూడా క్రీజులో ఇబ్బంది పడ్డాడు. హెన్రిక్స్, దీపక్ హుడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 30 బాల్స్కు గానీ ముంబై బౌండ్రీల ఖాతా తెరవలేదు. పవర్ప్లేలో 21 రన్స్ మాత్రమే చేసింది. ఈ సీజన్లో ఇదే లోయెస్ట్ పవర్ప్లే స్కోరు కావడం విశేషం. ఏడో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన స్పిన్నర్ రవి బిష్నోయ్.. ఇషాన్ ను ఔట్ చేయడంతో 26/2తో ముంబై మరింత డీలా పడింది. అయితే, ఫాబియన్ అలెన్ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టిన రోహిత్ స్పీడు పెంచాడు. ఆపై, హర్షదీప్ బౌలింగ్లో ఫోర్, హుడా ఓవర్లో సిక్స్ కొట్టాడు. మరోవైపు తాను ఎదుర్కొన్న 14వ బాల్ను సిక్సర్గా మలచిన సూర్యకుమార్ కూడా వేగంగా ఆడాడు. బిష్నోయ్ వేసిన 14వ ఓవర్లో ఫోర్తో రోహిత్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. సూర్య కూడా బౌండ్రీ కొట్టాడు. ఆపై, షమీ బౌలింగ్లో సూర్య ఇంకో బౌండ్రీ రాబట్టగా 16 ఓవర్లకు ముంబై 105/2తో నిలిచింది. రోహిత్, సూర్య క్రీజులో కుదురుకోవడంతో ఆ టీమ్ ఈజీగా 150 మార్కు చేరుకునేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో పంజాబ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 17వ ఓవర్ ఫస్ట్ బాల్కే సూర్యను ఔట్ చేసిన బిష్నోయ్.. థర్డ్ వికెట్కు 79 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. 18వ ఓవర్లో రోహిత్ను ఔట్ చేసిన షమీ మూడు రన్సే ఇచ్చాడు. అర్షదీప్ బౌలింగ్లో పొలార్డ్ సిక్సర్ బాదినా.. నాలుగు బాల్స్లో ఒకే పరుగు చేసిన హార్దిక్.. లాంగాఫ్లో హుడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లాస్ట్ ఓవర్లో క్రునాల్ (3) వికెట్ కోల్పోయిన ముంబై అతి కష్టంగా 130 మార్కు దాటింది.
కింగ్స్ ఈజీగా..
టాప్3 బ్యాట్స్మెన్ సత్తా చాటడంతో చిన్న టార్గెట్ను పంజాబ్ ఈజీగా ఛేజ్ చేసింది. ఛేజింగ్లో ఆ టీమ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఫస్ట్ ఓవర్లో బౌల్ట్ ఒకే రన్ ఇచ్చినా.. స్పిన్నర్ క్రునాల్ వేసిన తర్వాతి ఓవర్లో కెప్టెన్ లోకేశ్ రాహుల్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. మయాంక్ సిక్సర్ కొట్టడంతో 15 రన్స్ వచ్చాయి. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో లోకేశ్ షార్ట్ బాల్ను ఫైన్ లెగ్ మీదుగా స్టాండ్స్కు పంపి ఆకట్టుకున్నాడు. తర్వాత అతను స్లో అవగా.. మయాంక్ దూకుడు చూపెట్టాడు. బౌల్ట్ బౌలింగ్లో రెండు, బుమ్రా ఓవర్లో ఒక ఫోర్ రాబట్టడంతో పవర్ప్లేలో పంజాబ్ 45/0తో నిలిచింది. అయితే, రాహుల్ చహర్ వేసిన ఎనిమిదో ఓవర్లో అనవసర షాట్ ఆడిన మయాంక్ లాంగాన్లో సూర్యకు క్యాచ్ ఇవ్వడంతో ఫస్ట్ వికెట్కు 53 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. చహర్ పొదుపుగా బౌలింగ్ చేయగా.. లోకేశ్తో పాటు వన్డౌన్లో వచ్చిన క్రిస్ గేల్ కాసేపు జాగ్రత్తగా ఆడాడు. దాంతో, వరుసగా నాలుగు ఓవర్లలో ఒక్క బౌండ్రీ కూడా రాలేదు. 11 ఓవర్లకు 63/1తో నిలిచిన పంజాబ్పై కాస్త ఒత్తిడి పెరిగింది. ఈ టైమ్లో గేల్ గేరు మార్చాడు. చహర్ బౌలింగ్లోనే ఫోర్తో బౌండ్రీల ఖాతా తెరిచిన అతను.. జయంత్ బౌలింగ్లో 4, 4తో జోరు పెంచాడు. అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన లోకేశ్.. పొలార్డ్ ఓవర్లో సిక్స్తో మళ్లీ ఊపులోకి వచ్చాడు. అదే జోరుతో అతను 50 బాల్స్లో ఫిఫ్టీ మార్కు చేరుకోగా.. మరో ఎండ్లో గేల్ కూడా భారీ షాట్లు కొట్టాడు. బౌల్ట్ బౌలింగ్లో తను సిక్స్ కొట్టగా.. రాహుల్ 6, 4 బాది మ్యాచ్ను ఫినిష్ చేశాడు.
స్కోర్బోర్డ్
ముంబై: డికాక్ (సి) హెన్రిక్స్ (బి) హుడా 3, రోహిత్ (సి) అలెన్ (బి) షమీ 63, ఇషాన్ (సి) రాహుల్ (బి) బిష్నోయ్ 6, సూర్యకుమార్ (సి) గేల్ (బి) బిష్నోయ్ 33, పొలార్డ్ (నాటౌట్) 16, హార్దిక్ (సి) హుడా (బి) అర్షదీప్ 1, క్రునాల్ (సి) పూరన్ (బి) షమీ 3, జయంత్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు:6; మొత్తం: 20 ఓవర్లలో 131/6; వికెట్ల పతనం: 1–7, 2–26, 3–105, 4–112, 5–122, 6–130; బౌలింగ్: హెన్రిక్స్ 3–0–12–0, హుడా 3–0–15–1, షమీ 4–0–21–2, రవి బిష్నోయ్ 4–0–21–2, అలెన్ 3–0–30–0, అర్షదీప్ 3–0–28–1.
పంజాబ్: లోకేశ్ (నాటౌట్) 60, మయాంక్ (సి) కుమార్ (బి) చహర్ 25, గేల్ (నాటౌట్) 43; ఎక్స్ట్రాలు: 6; మొత్తం: 17.4 ఓవర్లలో 132/1; వికెట్ పతనం: 1–53; బౌలింగ్: బౌల్ట్ 2.4–0–30–0, క్రునాల్ 3–0–31–0, బుమ్రా 3–0–21–0, రాహుల్చహర్ 4–0–19–1, జయంత్ 4–0–20–0, పొలార్డ్ 1–0–11–0.