పై ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు సందీప్ సింగ్.. పంజాబ్ లో ఉంటాడు.. వయసు 39 సంవత్సరాలు.. రోజూ కూరగాయలు అమ్మకుంటాడు. అలా అని ఇతను ఏమీ చదువుకోలేదని మాత్రం అనుకోవద్దు.. నాలుగు డీగ్రీలు, ఒక పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ కూడా అందుకున్నాడు. 11ఏళ్లుగా పాటియాలాలోని పంజాబీ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్గా పనిచేశాడు.
అంతా బాగానే ఉంది కదా మరి ఈ కూరగాయలు అమ్ముకోవడం ఎంటనే అనుమానం రాకపోదు. సందీప్ సింగ్ చేసే జాబ్ లో జీతం తక్కువ .. ఆ జీతం కూడా సమయానికి ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇలా అయితే ఇళ్లు గడవడం కష్టమనుకున్న సందీప్ సింగ్.. ప్రొఫెసర్ వృత్తికి గుడ్ బై చెప్పేసి.. కూరగాయలు అమ్మడం ప్రారంభించాడు. ఓ బండి తీసుకుని దానికి పీహెచ్డీ సబ్జి వాలా అనే బోర్డు తగిలించి కూరగాయలు అమ్ముతున్నాడు.
జాబ్ కంటే ఈ బిజినెస్ చాలా బాగుందని.. మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా డబ్బులు బాగా వస్తున్నాయని అంటున్నాడు. కూరగాయలు అమ్ముతున్నప్పటికీ తన చదువును ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయడం లేదు సందీప్ సింగ్. వీలు దొరికినప్పుడల్లా చదువుకుంటున్నాడు. అంతేకాకుండా కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బుల్లో కొంత దాచి, త్వరలోనే ట్యూషన్ సెంటర్ తెరువాలని ఆశపడుతున్నాడు.