- సొంతంగా ల్యాండయిన ఇస్రో రాకెట్
- కర్నాటకలో విజయవంతంగా ప్రయోగం
- 4.5 కి.మీ. ఎత్తులో రాకెట్ను జారవిడిచిన చినూక్
ఇస్రో చేపట్టిన పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్తో ఈ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను నింగిలోకి తీసుకెళ్లి జారవిడవగా.. రన్ వేను వెతుక్కుంటూ, సొంతంగా దారి సరిచూసుకుంటూ పుష్పక్ రాకెట్ భద్రంగా ల్యాండయింది.
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ విమానంతో ఈ రీయూజబుల్ లాంచింగ్ వెహికల్(ఆర్ఎల్వీ) ను నింగిలోకి తీసుకెళ్లి జారవిడవగా.. రన్ వేను వెతుక్కుంటూ, సొంతంగా దారి సరిచేసుకుంటూ పుష్పక్ రాకెట్ భద్రంగా ల్యాండయింది. సొంత నేవిగేషన్ వ్యవస్థకు తోడు బ్రేక్ పారాచూట్ను ఉపయోగించుకుని కచ్చితత్వంతో రన్ వే పై ఆగిందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. శుక్రవారం ఉదయం కర్నాటక రాష్ట్రం చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ వద్ద ఐఏఎఫ్, ఇస్రో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించింది. రీయూజబుల్ రాకెట్ ను ఇస్రో 2016 లోనే తయారు చేయగా.. తొలి రెండు ప్రయత్నాలతో పాటు తాజాగా మూడోసారి కూడా పుష్పక్ ల్యాండింగ్ ప్రక్రియను సక్సెస్ ఫుల్గా నిర్వహించింది. అయితే, ఇప్పుడప్పుడే ఈ రీయూజబుల్ రాకెట్ను ఉపయోగించే అవకాశంలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఆర్ఎల్ వీ అందుబాటులోకి వస్తే ఉపగ్రహ ప్రయోగానికి అయ్యే ఖర్చు దాదాపుగా 80% తగ్గుతుందని వివరించారు.
టెస్ట్ జరిగిందిలా..
ఎయిర్ ఫోర్స్ కు చెందిన చినూక్ హెలికాఫ్టర్తో పుష్పక్ను నింగిలోకి తీసుకెళ్లారు. దాదాపు 4.5 కి.మీ.ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ను జారవిడిచారు. ల్యాండింగ్ పాయింట్ చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లోని రన్ వేకు సుమారు 4 కి.మీ. దూరంలో, 4.5 కి.మీ. ఎత్తులో పుష్పక్ను జారవిడవగా.. దారి సరిసు కుంటూ రాకెట్ కిందికి దూసుకొచ్చింది. వేగాన్ని నియంత్రించుకుంటూ, రన్ వే వైపుగా దారి సరిచూసుకుంటూ వచ్చింది. రన్ వే సమీపిం చాక స్పీడ్ తగ్గిస్తూ నిర్దేశిత ప్రాంతంలో ఆగేందు కు పుష్పక్కు అమర్చిన బ్రేక్ పారాచూట్ విడివడిం ది. ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్ వీల్ స్టీరింగ్ను స్వయంగా కంట్రోల్ చేసుకుంది. దీనికోసం పుష్పక్లో ఆటోమేటిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఇస్రో చీఫ్ సోమ్నాథ్ చెప్పారు.
పదేళ్ల క్రితం మొదలైన తయారీ..
పుష్పక విమాన్ తయారీ ప్రక్రియను ఇస్రో పదేళ్ల క్రితమే మొదలు పెట్టింది. దీనికోసం ఇంజనీర్లు, సైంటిస్టులు పదిమందితో ఇస్రో ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ బృందం అచ్చంగా విమానాన్ని పోలిన ఈ ఆర్ఎల్ వీని సిద్ధం చేసింది. దీని పొడవు ఆరున్నర మీటర్లు, బరువు 1.75 టన్నులు.. విమానానికి ఉన్నట్లే ల్యాండింగ్ గేర్లతో రెడీ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చించింది.
ఎందుకీ ఆర్ఎల్వీ..
రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఈ ఆర్ఎల్ వీ.. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించి తిరిగి భూమి మీద సేఫ్ గా ల్యాండవుతుంది. ఆపై మరోసారి దీనిని అంతరిక్షంలోకి పంపించే వీలుంటుంది. ఉపగ్రహాల కక్ష్య మార్చాలన్నా, కాలంచెల్లిన వాటిని భూమి పైకి తీసుకురావాలన్నా ఈ ఆర్ఎల్ వీలను ఉపయోగించుకోవచ్చు. దీంతో రాకెట్ ప్రయోగాలకు అయ్యే ఖర్చు తగ్గడంతో పాటు అంతరిక్షంలో పేరుకుపోయే వ్యర్థాలు కూడా తగ్గుతాయని సోమ్ నాథ్ వివరించారు. దేశ భవిష్యత్ అవసరాల కోసం దీనిని సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.