టోక్యో: డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. జపాన్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో సింధు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో సింధు 12–21, 13–21తో జాంగ్ యి మన్ (చైనా) చేతిలో ఓడింది. ఈ ఏడాది ఆడిన 13 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఈవెంట్స్లో తెలుగమ్మాయికి ఇది ఏడో తొలి రౌండ్ ఓటమి కావడం గమనార్హం. మరో మ్యాచ్లో మాళవిక 7–21, 15–21తో అయా వోహోరి (జపాన్) చేతిలో ఓడింది.
ఇక మెన్స్ డబుల్స్ రెండో ర్యాంక్లోకి వచ్చిన సాత్విక్–చిరాగ్ షెట్టి 21–16, 11–21, 21–13తో లియో రోలీ–మార్టిన్ (ఇండోనేసియా)పై నెగ్గి సెకండ్ రౌండ్లోకి ప్రవేశించారు. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 21–15, 12–21, 24–22తో ప్రియాన్షు రజావత్పై గెలవగా, మిథున్ మంజునాథ్ 21–13, 22–24, 18–21తో వెంగ్ హంగ్ యాంగ్ (చైనా) చేతిలో కంగుతిన్నాడు.