ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

విజయవాడ: పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి ఓటిటీ ప్లాట్ ఫామ్స్ పై సంచలన కామెంట్స్ చేశారు. భారత దేశంలో పేద వాడికి వినోదం లేదు, మధ్య తరగతి బడుగు వర్గాల ఇళ్లల్లో ఓ టి టి లేదు.. మరి వాళ్ల కెప్పుడు ఇస్తారు వినోదం అని ప్రశ్నించారు. విజయవాడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ నారాయణ మూర్తి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సంచలన కామెంట్లు చేశారు. ఇటీవల ఓ టి టి లో రిలీజ్ అయిన హీరో వెంకటేష్ సినిమా ‘‘నారప్ప’’  తెలుగు రాష్ట్రాలలో  కేవలం 25 శాతం మంది మాత్రమే చూశారని, మిగతా 75 శాతం మంది చూడలేకపోయారన్నారు. 
థియేటర్లో సినిమా చూడడం ఒక పండగ
సినిమా థియేటర్ లో సినిమా చూడడం ఒక పండుగ.. థియేటర్ అనుభూతే వేరు అని ఆయన పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రు వెంటనే సినిమా థియేటర్స్ తెరుచుకునే విధంగా చూడాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. కరోనా తో అందరూ ఫైట్ చెయ్యాల్సిందే.. కానీ పేద వాడికి వున్న ఒకే ఒక వినోదం సినిమా థియేటర్.. సినిమా బతకాలి.. థియేటర్స్ బతకాలి.. సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినిమా థియేటర్ ఓపెన్ అయేటట్టు చూడాలని నారాయణమూర్తి కోరారు. మనిషి వున్నంత కాలం థియేటర్ వుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. థియేటర్లు లేకపోతే స్టార్ డమ్ లు వుండవన్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు సినిమాలను ఓ టి టి లో రిలీజ్ చేయకుండా థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయ్యేటట్టు చూడాలని నారాయణమూర్తి కోరారు.