
- కలిసొచ్చిన రొటేషన్ సిస్టమ్
- ఆరు నియోజకవర్గాలపై అందరి దృష్టి
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్స్థానాలు ఎవరికి దక్కనున్నాయోననే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా సూర్యాపేట జడ్పీ స్థానం బీసీలకు రిజర్వుకాగా, నల్గొండ జిల్లాలో మొదటి సారి ఎస్టీ మహిళలకు చైర్మన్అయ్యే చాన్స్ దక్కింది. బీసీల రిజర్వేషన్ 42 శాతం పెంపు వల్ల వారికి కలిసొచ్చింది. దీంతో తొలిసారి ఉమ్మడి జిల్లాలో జనరల్ అభ్యర్థులు చైర్మన్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు.
బీసీలకు వచ్చిన అదృష్టం ఎవరిని వరిస్తుందో చెప్పలేకపోయినప్పటికీ గతంలో సమీకరణాలను పరిశీలిస్తే ఆరు నియోజకవర్గాలపైనా అందరి దృష్టి నెలకొంది. నాగార్జునసాగర్, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో గెలిచిన అభ్యర్థులకే జడ్పీ చైర్మన్అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నల్గొండ జిల్లా ఎవరికి దక్కేనో?
నల్లగొండలో ఎస్టీ మహిళకు రిజర్వు అయిన మండలాలు పెద్దవూర, దేవరకొండలో డిండి మండలాలు మాత్రమే ఉన్నాయి. ఎస్టీ జనరల్ స్థానాల్లో పీఏపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండ మండలాలు ఉన్నాయి.
గతంలో ఎస్టీ జనరల్ అయినప్పుడు దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్కు కాంగ్రెస్ నుంచి చైర్మన్అయ్యారు. అప్పుడు నాగార్జునసాగర్ నుంచి పెద్దవూర జడ్పీటీసీ కర్నాటి లింగారెడ్డి వైస్ చైర్మన్అయ్యారు. నాగార్జునసాగర్ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎస్టీలకు ప్రాతినిధ్యం లేదు. ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీ శంకర్నాయక్ మిర్యాలగూడ పరిధిలోని దామర చర్ల మండలం.
పైగా నాగార్జునసాగర్ జానారెడ్డి సొంత నియోజకవర్గం, ఎస్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతం. ఇక్కడి నుంచి ఎ న్నికైన జడ్పీటీసీకి చైర్మన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్టీలు అత్యధికంగా ఉన్న తిరుమలగిరి సాగర్ మండలం కూడా జనరల్అయ్యింది. ఇక్కడి నుంచి ఎస్టీ మహిళ పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయ సమీకరణాలు కుదిరితే చైర్మన్ పీఠం వాళ్లదే అవుతుంది.
సూర్యాపేట వర్సెస్ కోదాడ
బీసీలు అత్యధికంగా ఉన్న సూర్యాపేట జిల్లాలో చైర్మన్ సీటు పై గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో తుంగతుర్తి జడ్పీటీసీ గుజ్జ దీపిక (ఓసీ మహిళ) చైర్మన్ అయ్యారు. ఈసారి బీసీ జనరల్ కావడంతో సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల అభ్యర్థులు ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సూర్యాపేటలో బీసీ జనరల్ పెన్పహాడ్, నడిగూడెం, కోదాడ, హుజూర్నగర్లో గరిడేపల్లి, తుంగతుర్తిలో నాగారం మండలాలు ఉన్నాయి.
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హుజూర్నగర్ నుంచి, ఆయన భార్య పద్మావతి కోదాడ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందున సూర్యాపేట బీసీలకు చైర్మన్ అవకాశం కల్పిస్తే జిల్లా కేంద్రానికి రెండో కేబినెట్హోదా ఇచ్చినట్టు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కుల సమీకరణాలకే ప్రయార్టీ..
సూర్యాపేట జిల్లాలో చైర్మన్ఎంపిక ప్రధానంగా కుల సమీకరణాలకే ప్రయార్టీ ఇస్తున్నారు. గతంలో రెండు జడ్పీలు జనరల్, సూర్యాపేట మహిళలకు రిజర్వు అయినప్పుడు నల్గొండ, యాదాద్రి రెడ్డి వర్గానికి, సూర్యాపేట వెలమ వర్గంతో భర్తీ చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుల పదవుల పంపకాల్లో సైతం నల్లగొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ, యాదాద్రి రెడ్లకు ఇచ్చారు. ఇదే విధానం ఈ ఎన్నికల్లోనూ కొనసాగించక తప్పదని సీనియర్లు అంటున్నారు. గౌడ, యాదవ, పద్మశాలీ, మున్నూరుకాపు, ముదిరాజ్సామాజిక వర్గాలు బలంగా ఉన్న ఈ రెండు జిల్లాలో ఏ కులానికి ప్రాధాన్యత దక్కుతుందో వేచి చూడాల్సిందే.