రాహుల్​ వచ్చాడంటే బీజేపీ గెలిచినట్టే : ఆదిత్యనాథ్

రాహుల్​ వచ్చాడంటే బీజేపీ గెలిచినట్టే : ఆదిత్యనాథ్

యావత్మాల్: ‘మహారాష్ట్రలో రాహుల్​ గాంధీ అడుగుపెట్టారంటే.. ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం బీజేపీదే విజయం’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమర్​ఖేడ్​లో జరిగిన బహిరంగ సభలో యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాందేడ్​లో ఎయిర్​పోర్ట్​లో దిగగానే రాహుల్​గాంధీ కూడా ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారని తెలిసిందన్నారు. ఆయన ప్రచారంచేస్తే రాష్ట్రంలో బీజేపీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు.

టెర్రరిజాన్ని సమూలంగా తుడిచిపెట్టేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. మోడీ, అమిత్​ షాలు కలిసి ‘ఏక్​ భారత్, శ్రేష్ట్​ భారత్’ కాన్సెప్ట్​ను అమలు చేస్తున్నారని, కాశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అందులో భాగమేనని యోగి వివరించారు.