కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నోట.. బీసీ మాట

 కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి నోట.. బీసీ మాట
  • భువనగిరి ఎంపీ టికెట్​బీసీలకు ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే ప్రతిపాదన
  • తన భార్య పోటీ చేస్తే తనకు కేబినెట్‌‌లో ఛాన్స్ మిస్సవుతుందని సందేహం
  • బీసీ అభ్యర్థుల రేసులో తెరపైకి నేతి విద్యాసాగర్, మధుయాష్కీగౌడ్​ 

నల్గొండ, వెలుగు: భువనగిరి పార్లమెంట్​ కాంగ్రెస్ టికెట్​విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.  పార్టీ జరిపిన సర్వేలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి భార్య లక్ష్మి, సీఎం రేవంత్​ రెడ్డి సన్నిహితుడు చామల కిరణ్​ కుమార్​రెడ్డి పేర్లు ఫైనల్​ లిస్ట్​లో ఉన్నప్పటికీ.. రాజగోపాల్​రెడ్డి మాత్రం బీసీలకు టికెట్‌‌ ఇస్తే బాగుటుందనే ప్రతిపాదన తెరపైకి తెచ్చారు.  

ఇటీవల మునుగోడులో పర్యటించిన సందర్భంగా బీసీ క్యాండిడేట్ అయితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదనే అభిప్రాయాన్ని హైకమాండ్​కు చెప్పినట్టు ఆయన వెల్లడించారు.  బీఆర్ఎస్ అభ్యర్థిగా క్యామ మల్లేశ్‌‌ను ప్రకటించిన తెల్లారే రాజగోపాల్​రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ సైతం బూర నర్సయ్యగౌడ్​ను అభ్యర్థిగా పక్రటించిన సంగతి తెలిసిందే.  సామాజిక సమీకరణాల కోణంలో బీసీకి టికెట్‌‌ ఇస్తే ఈజీగా గెలువొచ్చిన వాదన ఉన్నప్పటికీ.. మరో కోణంపైనా చర్చ జరుగుతోంది.   
 
పోటీకి రాజగోపాల్‌‌ రెడ్డి నిరాస్తకత 

భువనగిరి అభ్యర్థి ఎంపిక విషయాన్ని పార్టీ హైకమాండ్​ సీరియస్​గా తీసుకుంది. దీనికోసం ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సునీల్​ కనుగోలు సర్వే చేయగా.. కోమటిరెడ్డి లక్ష్మి, చామల కిరణ్​ కుమార్​ రెడ్డి పేర్లు ఫైనల్ అయినట్లు తెలిసింది. అయితే ఎంపీ టికెట్​కోసం కోమటిరెడ్డి లక్ష్మి అప్లై చేసుకోలేదు. రాజగోపాల్​ రెడ్డి కూడా హైకమాండ్‌‌ వద్ద ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు.  

కానీ హైకమాండ్ మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. భువనగిరి సెగ్మెంట్​లో కోమటిరెడ్డి ఫ్యామిలీకి మంది ప్రజాదరణ ఉంది.  అన్నదమ్ములిద్దరు ఇది వరకు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించినందున పార్టీ లక్ష్మి వైపు మొగ్గు చూపినట్టు సమాచారం. కానీ, రాజగోపాల్​ రెడ్డి మంత్రి పదవిపైనే ఫోకస్​ పెట్టారు. రాష్ట్ర కేబినెట్‌‌లో పదవి ఇస్తామని హైకమాండ్​ హామీ ఇచ్చిందని ఆయన చెబుతున్నారు.  ఎంపీగా టికెట్‌‌ తీసుకుంటే  కేబినెట్​లో చోటు మిస్సయ్యే ఛాన్స్​ఉండొచ్చని ఆయన సందేహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇద్దరు సీఎం రేవంత్ ​సన్నిహితులే..

నల్గొండ ఎంపీ క్యాండిడేట్‌‌ కుందూరు రఘువీర్​ రెడ్డి, భువనగిరి టికెట్​ఆశిస్తున్న చామల కిరణ్​ కుమార్​ రెడ్డి ఇద్దరు సీఎం రేవంత్​కు అత్యంత సన్నిహితులు. ఇద్దరికీ పార్టీ అగ్రనేతల సపోర్ట్​ ఉంది. అయితే కిరణ్​ కుమార్​ రెడ్డి విషయంలో ఒకరిద్దరు సీనియర్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కిరణ్​ఎంపీగా ఎంట్రీ ఇస్తే భువనగిరి కాంగ్రెస్​లో కొత్త నాయకత్వానికి భీజం పడినట్టేనని, అది తమకు ఇబ్బంది అవుతుందేమోనని వాళ్లు సందేహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

ఈ నెల 30 చివరి డెడ్​లైన్​..

ఈ నెల 27న కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ ఢిల్లీలో జరగనుంది. ఈ మీటింగ్‌‌లో భువనగిరి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికీ తేలకపోతే 30న ఫైనల్​ సీఈసీ మీటింగ్​ ఉందని చెబుతున్నారు. ఈ మీటింగ్‌‌లో దేశ వ్యాప్తంగా పెండింగ్​లో పెట్టిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని సీనియర్లు అంటున్నారు. భువనగిరి సస్పెన్స్​వీడాలంటే మరో నాలుగైదు రోజులు ఆగా ల్సిందే. 

బీసీ అయితే క్యాండేట్​ఎవరు..?

రాజగోపాల్​ రెడ్డి వ్యాఖ్యలకు కొద్దిరోజుల ముందు భువనగిరి ఎంపీ సెగ్మెంట్​ పరిధిలోని ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా పార్టీ అడిగి తీసుకుంది. రెడ్డి సామాజిక వర్గానికి టికెట్​ఇవ్వకపోతే, ఆ ప్లేస్​లో బీసీలకు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయ పడినట్టు తెలిసింది.  బీసీ క్యాండిడేట్‌‌ అయితే ఎవరిని నిలబెట్టాలన్నది పార్టీకి సవాల్​గా మారింది. మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్​ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా మధుయాష్కీ గౌడ్​ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, రాజగోపాల్ రెడ్డి మాత్రం పార్టీ నుంచి ఒత్తిడి ఎక్కువైతే అప్పుడు ఆలోచన చేస్తాం తప్ప, కోమటిరెడ్డి ఫ్యామిలీకి పదవులు కొత్త కాదని చెబుతున్నారు.