మహిళలపై వేధింపులకు పాల్పడే వారికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వేధింపులు లేదా ఈవ్ టీజింగ్ చర్యలు వ్యక్తుల చర్యలు వారి క్యారెక్టర్ సర్టిఫికేట్లో పొందుపరచబడతాయని తెలిపిన గెహ్లాట్, ఇది వారికి ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తుందని వెల్లడించారు.
సోమవారం అర్థరాత్రి తన నివాసంలో జరిగిన సమావేశంలో అశోక్ గెహ్లాట్.. ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వేధింపులకు పాల్పడే వారికోసం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలన్న ఆయన.. పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లలో అలాంటి వ్యక్తుల నిఘా కోసం పోలీసులను సివిల్ డ్రెస్లో మోహరించాలని సూచించారు.
అలాగే వేధింపులకు పాల్పడే వారిపై ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హత వేటు వేయడమే కాకుండా, ఇప్పటికే అలాంటి రికార్డు ఉన్న వారి వివరాలు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ బోర్డ్ వంటి ప్రభుత్వ రిక్రూట్మెంట్ ఏజెన్సీలకు పంపబడుతుందని గెహ్లాట్ వెల్లడించారు.
మణిపూర్లో మహిళలపై జరిగిన అమానవీయ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి ఘటనలో మరోసారి పునరావృతం అవ్వకుండా ఉండేందుకే గెహ్లాట్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా, మహిళలపై జరుగుతున్న నేరాలలో రాజస్థాన్ మొదటి మూడు రాష్ట్రాలలో ఉంది.