ఎగ్జామ్​కు వెళ్తుంటే ప్రమాదం.. ఆరుగురు మృతి

ఎగ్జామ్​కు వెళ్తుంటే ప్రమాదం.. ఆరుగురు మృతి

జైపూర్: టీచర్​ ఎలిజిబిలిటీ పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరగడంతో ఆరుగురు చనిపోగా, మరో ఐదుగురు గాయపడ్డరు. రాజస్థాన్​లోని చక్సు ఏరియాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. శనివారం పదకొండు మంది బరన్ నుంచి సికర్ కు వ్యాన్ లో వెళ్తున్నరు. చక్సు ఏరియాలో ఆగి ఉన్న లారీని వాళ్ల వ్యాన్​ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆరుగురు అభ్యర్థులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి గాయాలవడంతో ట్రీట్​మెంట్ కోసం ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అయితే, వ్యాన్ లో ఉన్నవాళ్లంతా టీచర్ ఉద్యోగాలకు జరగబోయే ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్ టెస్ట్ రాసేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయాలైనోళ్లకు50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ ట్రాన్స్​పోర్టు బస్సుల ను ఉపయోగించాలని సూచించారు. ప్రాణాల కంటే ఏ ఎగ్జామ్​కూడా ముఖ్యం కాదని గెహ్లాట్ చెప్పారు. కాగా, ప్రభుత్వ స్కూళ్లలో 31 వేల టీచర్ పోస్టుల భర్తీకి జరిగే ఈ టెస్ట్​కు రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కీలకమైన ఈ పరీక్ష గతంలో ఐదుసార్లు వాయిదా పడటంతో ఈ సారి నిర్వహణకు రాష్ట్ర సర్కారు పకడ్బంధీ చర్యలు చేపట్టింది.