రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మించారు. గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలియజేసేందుకు ప్రెస్మీట్ నిర్వహించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘ప్రీమియర్స్ నుంచి నా ఫోన్ మోగుతూనే ఉంది. ‘ఉప్పెన’కు మించి పదిరెట్ల రెస్పాన్స్ వస్తోంది.
అందరూ పెద్ద హిట్ అంటున్నారు. అలాగే చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి, తన కష్టం గురించి మాట్లాడుతున్నారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఫ్యామిలీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు’ అని చెప్పాడు. నిర్మాత నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ‘తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. చరణ్ గారి కెరీర్లో బెస్ట్ సినిమా. ఆ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి.
టికెట్ రేట్ల విషయంలో సహకరించిన ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు థ్యాంక్స్. నిర్మాతగా తొలి సినిమాకే ఇంత పెద్ద బ్లాక్బస్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను’ అని చెప్పారు. మైత్రి నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ‘ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపి రామ్ చరణ్ గారి కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది.
శనివారం, ఆదివారం కలెక్షన్లు మరింత భారీగా రాబోతున్నాయని భావిస్తున్నాం’ అని చెప్పారు. మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ ‘రామ్ చరణ్ గారి కెరీర్లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ రికార్డ్ ఇది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రికార్డులు సృష్టిస్తుందని నమ్ముతున్నాం’ అన్నారు.
