పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ గ్రూప్–డి ఎలైట్ రెండో మ్యాచ్లో హైదరాబాద్కు శుభారంభం దక్కింది. రాహుల్ సింగ్ (114 బ్యాటింగ్) సెంచరీకి తోడు హిమతేజ (62 బ్యాటింగ్) చెలరేగడంతో.. శనివారం (అక్టోబర్ 25) తొలి రోజు ఆట ముగిసే టైమ్కు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 70 ఓవర్లలో 255/1 స్కోరు చేసింది.
టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (36), అభిరత్ రెడ్డి (35) మెరుగ్గా ఆడారు. పుదుచ్చేరి బౌలింగ్ను దీటుగా ఎదుర్కొని తొలి వికెట్కు 88 రన్స్ జోడించారు. అయితే 23వ ఓవర్లో సాగర్ ఉదేశి (1/64) అభిరత్ను ఔట్ చేశాడు. ఈ దశలో వచ్చిన రాహుల్ సింగ్ నిలకడగా ఆడాడు. రెండో ఎండ్లో తన్మయ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.
అతని ప్లేస్లో వచ్చిన హిమతేజ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరు రెండో వికెట్కు అజేయంగా167 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు.
