- అక్టోబర్లో పెరిగిన కార్డులు 5,186
- పెరిగిన రేషన్ కోటా 93 టన్నులు
- ఉమ్మడి జిల్లాలో 11,47,560 కార్డులు
- నవంబర్ బియ్యం కోటా.. 22,007 టన్నులు
యాదాద్రి, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తన మాట నిలుపుకుంటోంది. ఇచ్చిన మాట ప్రకారం వేగంగా కార్డులు జారీ చేస్తోంది. కార్డు కావాలని అప్లికేషన్ వచ్చిందంటే.. ఆఫీసర్లు పరిశీలించి అర్హులైతే చాలు ఓకే చేసేస్తున్నారు. దీంతో ప్రతి నెల బియ్యం కోటా పెరుగుతోంది. కొత్తగా లక్షల మందికి రేషన్ అందిస్తున్నారు.
ప్రతి నెల కొత్త రేషన్ కార్డుల జారీ
పదేండ్లు అంటే 2023 వరకూ పవర్లో ఉన్న బీఆర్ఎస్ సర్కారు.. కొత్త రేషన్ కార్డుల జారీ, మెంబర్స్ను యాడ్ చేయడాన్ని పట్టించుకోలేదు. అన్ని స్కీమ్స్కు రేషన్కార్డు కచ్చితం కావడంతో అనేకమంది ఇబ్బందులకు గురయ్యారు. కాంగ్రెస్ సర్కారు పవర్లోకి రాగానే ముందుగా వీటిపైనే దృష్టి సారించి, అప్లికేషన్లను స్వీకరించింది. ఫిబ్రవరి నుంచి ప్రతి నెల కొత్త కార్డులను జారీ చేయడం ప్రారంభించింది.
ఒక్కో నెలలో వేలల్లో కార్డులు
ప్రతీ నెలలో వేల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నారు. జనవరి 2025లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10,06,994 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. 29,82,579 మంది మెంబర్లున్నారు. ఈ విధంగా అక్టోబర్ 23 నాటికి అంటే 9 నెలల్లో 1,40,566 కుటుంబాలకు కొత్త రేషన్ కార్టులను జారీ చేసింది. దీంతో మొత్తం కార్డుల సంఖ్య 11,47,560 చేరగా, ఈ కార్డుల్లో 34,66,221 మెంబర్లుగా ఉన్నారు.
ప్రతి నెల కార్డులు పెంచినట్టుగానే అక్టోబర్ నెలలో 5,186 కొత్త కార్డులు జారీ అయినట్టు సివిల్ సప్లయ్ డిపార్ట్మెంట్ 'డైనమిక్ కీ రిజిస్ట్రర్' (డీకేఆర్) లెక్కలు చెబుతున్నాయి. ఈ కార్డుల్లో 15,249 మంది మెంబర్లు చేర్చడంతో ఈ నెల నుంచి వారందరికీ రేషన్ అందనుంది. దీంతో నవంబర్ రేషన్ కోటా కింద 22,007 టన్నుల బియ్యాన్ని కేటాయించారు. ఈ లెక్కన అక్టోబర్ కోటా కంటే నవంబర్లో 93 టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించినట్టయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,02,95,193 కార్డులు ఉన్నాయి.
ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడు నెలలుగా కార్డులు, మెంబర్ల సంఖ్య, బియ్యం కోటా
నెల కార్డులు యూనిట్లు బియ్యం కోటా
సెప్టెంబర్ 11,28,359 34,16,159 21,698
అక్టోబర్ 11,42,374 34,50,972 21,914
నవంబర్ 11,47,560 34,66,221 22,007
