ముంబై : తాము ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫిన్టెక్ కంపెనీలు స్వీయ నియంత్రణ సంస్థ (సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్) ఏర్పాటు చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఫిన్టెక్ ఇండస్ట్రీ శరవేగంతో ఎదుగుతున్న నేపథ్యంలో ఇది తప్పనిసరని చెప్పారు. డిజిటల్ పేమెంట్లు, డిజిటల్గా తీసుకునే అప్పులు దేశంలో భారీగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫిన్టెక్ రంగంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని శక్తికాంత దాస్ వెల్లడించారు.
బుధవారం జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ఫెస్ట్2023 కాన్ఫరెన్స్లో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. ఫిన్టెక్ ఇండస్ట్రీలో ఉండే సమస్యలను సమర్ధంగా తెలియచెప్పడానికి ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ వీలు కల్పిస్తుందని అన్నారు. అంతేకాకుండా, మొత్తం నియంత్రణభారమంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద పడకుండా ఉంటుందని పేర్కొన్నారు.
2024 లో జరిగే గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ లోపు ఎస్ఆర్ఓ ఏర్పాటుకు చొరవ తీసుకుంటారనే ఆశాభావాన్ని శక్తికాంత దాస్ వ్యక్తం చేశారు. 2030 నాటికి దేశంలోని ఫిన్టెక్ ఇండస్ట్రీ 200 బిలియన్ డాలర్ల రెవెన్యూ మార్కును అందుకుంటుందని, గ్లోబల్ ఫిన్టెక్ రెవెన్యూలో ఇది 13 శాతానికి సమానమవుతుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు.
2030 నాటికి ఫిన్టెక్ రెవెన్యూ
1.5 ట్రిలియన్ డాలర్లకు...
ఇండియాలో ఫిన్టెక్ ఇండస్ట్రీ పాత్ర రాబోయే రోజులలో మరింత ఎక్కువవుతుందని పేర్కొన్నారు. గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెవెన్యూలో ప్రస్తుతం ఫిన్టెక్ వాటా 245 బిలియన్ డాలర్లని, అంటే 2 శాతమేనని చెప్పారు. 2030 నాటికి ఫిన్టెక్ రెవెన్యూ 1.5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు దాస్ వెల్లడించారు. ఇండియా ఫిన్టెక్ ఇండస్ట్రీ ఇదే కాలంలో 200 బిలియన్ డాలర్ల రెవెన్యూను అందుకుంటుందని పేర్కొన్నారు.
2014 నాటికి దేశంలో 1.2 బిలియన్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగితే, 2022 నాటికి ఆ సంఖ్య 90 బిలియన్లు మించిందని అన్నారు. మై గవ్ ఇండియా ఈ డేటాను రిలీజ్ చేసిందని చెప్పారు. గ్లోబల్ రియల్టైమ్ ట్రాన్సాక్షన్లలో ఇండియా వాటా 2022లో 46 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోని నాలుగు లీడింగ్ దేశాలలోని డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ల కంటే ఇండియాలో ట్రాన్సాక్షన్లు ఎక్కువని వివరించారు.
మన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్లు వాల్యూ, వాల్యూమ్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయని దాస్ చెప్పారు. ఇండియాలోని పేమెంట్ ఎకోసిస్టమ్ ఎంత రోబస్ట్గా ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చన్నారు. సెంట్రల్బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) హోల్సేల్పైలట్ కోసం మరికొన్ని టెస్ట్కేసులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.