- పీఎన్బీ, కెనరా బ్యాంక్ షేర్లు 5 శాతానికి పైగా క్రాష్
- 12 శాతం వరకు నష్టపోయిన ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్, ఐఆర్ఈడీఏ
- లోన్ అమౌంట్లో 5 శాతం ప్రొవిజనింగ్ చేయాలన్న ఆర్బీఐ
న్యూఢిల్లీ: కన్స్ట్రక్షన్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు అప్పులివ్వడాన్ని ఆర్బీఐ కఠినతరం చేయడంతో సోమవారం సెషన్లో ప్రభుత్వ బ్యాంక్ షేర్లు భారీగా పడ్డాయి నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ 3.6 శాతం నష్టపోయింది. పీఎన్బీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ షేర్లు 4 శాతం వరకు పడ్డాయి. ఎన్బీఎఫ్సీలు ఆర్ఈసీ, పవర్ ఫైనాన్స్, ఐఆర్ఈడీఏ షేర్లు 12 శాతం వరకు పతనమయ్యాయి.
ఈ కంపెనీలు ఎక్కువగా పవర్ ప్రాజెక్ట్లకు ఫైనాన్స్ చేస్తున్నాయి. కేంద్రం ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వడంతో దేశంలో ఇన్ఫ్రా ప్రాజెక్ట్ల నిర్మాణం ఊపందుకుంది. గతంలో ఇన్ఫ్రా ప్రాజెక్ట్లు డీఫాల్ట్గా మారిన సంఘటనలు చూడొచ్చు. ఫలితంగా బ్యాంకింగ్ సెక్టార్పై ఒత్తిడి పెరిగేది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఆర్బీఐ తాజాగా కొత్త గైడ్లైన్స్ను ప్రపోజ్ చేసింది.
కొత్త గైడ్లైన్స్ ఏంటంటే?
అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్లకు ఇచ్చే లోన్లపై మానిటరింగ్ పెంచుతామని ఈ నెల 3 న విడుదల చేసిన డ్రాఫ్ట్ పేపర్లలో ఆర్బీఐ పేర్కొంది. ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ దశలో ఉంటే లెండర్లు లోన్ అమౌంట్లో ఐదు శాతాన్ని ప్రొవిజనింగ్ కోసం కేటాయించాలని ప్రపోజ్ చేసింది. ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే ఈ అమౌంట్ సైజ్ 2.5 శాతానికి తగ్గుతుంది. లెండర్ల నుంచి తీసుకున్న లోన్ను తీర్చే స్టేజ్కు అంటే సంబంధిత ప్రాజెక్ట్ క్యాష్ ఫ్లోస్ను జనరేట్ చేయగలిగితే ఈ అమౌంట్ ఒక శాతానికి తగ్గుతుంది. ఐదు శాతం ప్రొవిజనింగ్ చేయడాన్ని రెండు దశల్లో లెండర్లు అమలు చేయాలని ఆర్బీఐ ప్రపోజ్ చేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రాజెక్ట్కు ఇచ్చిన లోన్ అమౌంట్లో 2 శాతాన్ని, 2025–26 లో 3.5 శాతాన్ని, 2026–27 లో ఐదు శాతం అమౌంట్ను ప్రొవిజనింగ్ చేయాలని పేర్కొంది. ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్లకు ఇచ్చిన లోన్లో కేవలం 0.4 శాతం మాత్రమే బ్యాంకులు ప్రొవిజనింగ్ చేస్తున్నాయి. ఇది ఓవర్డ్యూ లేదా ఒత్తిడిలో లేని ప్రాజెక్ట్లకు మాత్రమే. అంతేకాకుండా ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో బ్యాంకులకు క్లారిటీ ఉండాలని, ఒక వేళ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే ప్రొవిజనింగ్ పెంచాలని ఆర్బీఐ ప్రపోజ్ చేసింది.
మూడేళ్లు ఆలస్యం అయితే సంబంధిత ప్రాజెక్ట్ను ఒత్తిడిలోని ప్రాజెక్ట్గా క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. మరోవైపు హోల్సేల్ సెగ్మెంట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ– డిజిటల్ రూపాయి) లో కమర్షియల్ పేపర్లు, సర్టిఫికెట్ డిపాజిట్ల కోసం పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తామని సోమవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. యూపీఐతో కలిసి సీబీడీసీ రిటైల్ ట్రాన్సాక్షన్లు రోజుకి 10 లక్షల ట్రాన్సాక్షన్లు దాటిందని అన్నారు. కానీ, యూజర్లు యూపీఐకే మొగ్గు చూపుతున్నారని వివరించారు.