ముంబై: మనదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటని, దీనికి మరింత ఎదిగే సత్తా ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఏవైనా రిస్క్లు ఏర్పడకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్బీఐ 28వ సంచిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్) విడుదల సందర్భంగా దాస్ మాట్లాడుతూ ధరల స్థిరత్వాన్ని సాధించడం, మధ్యకాలిక రుణ స్థిరత్వం ఉండేలా చూడటం, ఆర్థిక రంగం పునరుద్ధరణను మరింత బలోపేతం చేయడం, కొత్త వృద్ధి అవకాశాలను సృష్టించడం, హరిత వృద్ధిని ప్రోత్సహించడం తమ ప్రాధాన్యతలు అని స్పష్టం చేశారు.
‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బహుళ సవాళ్లను ఎదుర్కొంటోంది. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం వీటిని సమర్థంగా ఎదుర్కొంటున్నది. ఎందుకంటే మన ఆర్థిక విధానం పటిష్టంగా ఉంది. ఇది వృద్ధిని బలోపేతం చేస్తోంది. మేం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాము. ప్రమాదాల పెరుగుదలను నివారించడానికి ముందస్తుగా నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి కట్టుబడి ఉన్నాము" అని ఆయన స్పష్టం చేశారు. రిస్క్ ఉండే కొన్ని రకాల రిటైల్ రుణాలను తగ్గించుకోవాలని బ్యాంకులకు సూచించామని, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటానికే ఇలా చేశామని చెప్పారు. అయితే ఎకానమీకి అవసరమైన నిధులను అందుబాటులో ఉంచుతామని దాస్ భరోసా ఇచ్చారు.
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.. ముఖ్యమైన బ్యాంకులు
ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐలను.. డొమెస్టిక్ సిస్టెమాటికల్లీ ఇపార్టెంట్ బ్యాంక్స్గా (డీ–-ఎస్ఐబీలు) గుర్తించామని ఆర్బీఐ తెలిపింది. ఇవి ‘విఫలం కాలేనంత పెద్దవి' అని పేర్కొంది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్వర్క్ ప్రకారం, ఆగస్టు 2015 నుంచి ప్రతి సంవత్సరం డీ–ఎస్ఐబీలుగా గుర్తించిన బ్యాంకుల పేర్లను ఆర్బీఐ వెల్లడించాలి. డీ–ఎస్ఐబీలను వాటి సిస్టమిక్ ఇంపార్టెన్స్ స్కోర్(ఎస్ఐఎస్) ఆధారంగా నాలుగు బకెట్లలో ఉంచాలి. ఐసీఐసీఐ బ్యాంకు గత ఏడాది మాదిరిగానే బకెట్ నిర్మాణంలో కొనసాగుతుండగా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు అధిక బకెట్లకు వెళ్లాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్బీఐ బకెట్ 3 నుంచి బకెట్ 4కి మారింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బకెట్ 1 నుంచి బకెట్ 2కి మారింది, అంటే ఈ బ్యాంకులు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ శాతం ప్రకారం అదనపు కామన్ ఈక్విటీ టైర్ 1ని చేరుకోవాలి.