న్యూఢిల్లీ: జూన్ నెలకు సంబంధించి ఇండియాలో రిటైల్ ఇన్ఫ్లేషన్ అంచనాల కంటే ఎక్కువ పెరగగా, యూఎస్లో మాత్రం తగ్గింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరగడంతో దేశంలో రిటైల్ ఇన్ఫ్లేషన్ను కొలిచే కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) జూన్లో 4.81 శాతంగా రికార్డయ్యింది. అంతకు ముందు నెలలో ఈ నెంబర్ 4.25 శాతంగా నమోదు కాగా, ఈసారి 4.60 శాతంగా ఉంటుందని నిపుణులు అంచనావేశారు. యూఎస్లో మాత్రం ఇన్ఫ్లేషన్ 2021, మార్చి తర్వాత అత్యంత తక్కువగా నమోదయ్యింది. ఏడాది లెక్కన జూన్లో ఇన్ఫ్లేషన్ 3 శాతం నమోదు కాగా, 3.1 శాతంగా రికార్డవుతుందని ఎనలిస్టులు అంచనావేశారు. ఈ ఏడాది మేలో యూఎస్ ఇన్ఫ్లేషన్ 4 శాతంగా ఉంది. బేస్ ఎఫెక్ట్ వలన ఇన్ఫ్లేషన్ ఎక్కువగా తగ్గినట్టు కనిపిస్తోందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఐఐపీ అప్..
పరిశ్రమల ఉత్పాదకతను కొలిచే ఇండియా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) ఈ ఏడాది మేలో 5.2 శాతానికి పెరిగింది. అంతకు ముందు నెలలో ఈ నెంబర్ 4.5 శాతంగా రికార్డయ్యింది. మాన్యుఫాక్చరింగ్, మైనింగ్ సెక్టార్లు మంచి పెర్ఫార్మెన్స్ బాగుండడంతో ఐఐపీ పెరిగింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్ అవుట్పుట్ మే నెలలో 5.7 శాతం
పెరిగింది.
ఓపెనింగ్ లాభాలు పోయే..
వరసగా మూడు సెషన్లలో లాభపడిన ఇండెక్స్లు బుధవారం సెషన్లో నష్టాల్లో ముగిశాయి. సెషన్ చివరిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో సెన్సెక్స్ 224 పాయింట్లు (0.34 శాతం) నష్టపోయి 65,394 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 55 పాయింట్లు పడి 19,384 వద్ద సెటిలయ్యింది. ఇంట్రాడేలో ఈ ఇండెక్స్ 19,507 వరకు వెళ్లింది. సెన్సెక్స్లో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ఎక్కువగా పడ్డాయి. కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎస్బీఐ, టైటాన్ షేర్లు లాభాల్లో ముగిశాయి. జపాన్, చైనా మార్కెట్లు నష్టాల్లో క్లోజవ్వగా, షాంఘై, సౌత్ కొరియా మార్కెట్లు లాభపడ్డాయి.