
- మొదటిసారి గ్యాలరీ పనులకు మోక్షం
- గతంలో వర్షాకాలం వచ్చిందంటే వణుకు
- ఇప్పుడు వరద ముప్పు ఉండదంటున్న ఆఫీసర్లు
నిర్మల్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు కొత్తకళ సంతరించుకుంది. గతంలో జరిగిన వరద ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కడెం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది.
ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.9 కోట్ల కేటాయించగా, ఈసారి వరద నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు నెలల నుంచి ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఆయా పనులు ప్రస్తుతం చివరి దశలో ఉండగా, వారం, పది రోజుల్లో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. గతంలో నిధుల కొరతతో అరకొర మరమ్మతులు చేపట్టేవారు. దీంతో నాలుగేండ్ల నుంచి కడెం ప్రాజెక్టు వరద ముప్పులో చిక్కుకుంటున్నది. ఈసారి మరమ్మతు పనులన్నీ నాణ్యతగా పూర్తి చేయగా, వరదలు వచ్చినా ఎలాంటి ముప్పు లేకుండా పనులు చేపట్టారు.
గేట్ల పైనే ప్రధానంగా ఫోకస్..
కడెం ప్రాజెక్టుకు సంబంధించిన 18 గేట్లకు గతంలో మరమ్మతులు సక్రమంగా చేయకపోవడంతో పైనుంచి వచ్చే వరద పెరిగే సమయంలో గేట్లను పైకెత్తాలంటే ఇబ్బందులు ఏర్పడేవి. గేట్లకు సంబంధించిన రెండు కౌంటర్ వెయిటర్లు, ఓ గేటు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఇటు డ్యాంకు, అటు లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు తలెత్తేది. ఈసారి మొత్తం 18 గేట్ల మరమ్మతుల పనులు పూర్తి చేశారు. ఏటా అధికారులను ఇబ్బంది పెట్టే 15వ నంబర్ గేటును పూర్తిగా పునరుద్ధరించారు.
అన్ని గేట్లకూ గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు పూర్తికాగా, పైకెత్తేందుకు ఉపయోగించే గేర్లు, రోప్స్ కు కార్డియమ్ కాంపౌండ్ ను ఉపయోగించి మరమ్మతు చేశారు. అధికారులు రెండు నెలల నుంచి ఆయా ప్రత్యేక దృష్టి పెట్టి గడువులోగా పనులు పూర్తి చేశారు. ఈ గేట్ల కింది భాగంలో వరదకు కొట్టుకు వచ్చిన కలప, ఇతర చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు.
మొదటిసారి గ్యాలరీ పనులకు మోక్షం...
కడెం ప్రాజెక్టు అడుగు భాగంలో ఉన్న 3 గ్యాలరీలు చెత్తాచెదారంతో నిండిపోయాయి. ఇందులో నుంచి రెండు గ్యాలరీలకు తొమ్మిది స్కౌర్ గేట్లు ఉన్నాయి. ఈ స్కౌర్ గేట్లు డ్యామ్ స్పిల్ వే కింద ఉంటాయి. పదేండ్ల నుంచి ఈ గ్యాలరీల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో శిథిలావస్థకు చేరాయి.
2022లో వచ్చిన వరద కారణంగా ఈ గ్యాలరీలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయి, సీపేజీ సిస్టం దెబ్బతిన్నది. దీంతో మొదటిసారిగా అధికారులు ఈ గ్యాలరీలను ఆధునికరిస్తుండడమే కాకుండా తొమ్మిది స్కౌర్ గేట్లకు మరమ్మతులు కూడా మొదలుపెట్టారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించారు.
చివరి దశలో ఎలక్ట్రిఫికేషన్ పనులు..
ప్రాజెక్టు ఎలక్ట్రిఫికేషన్ పనులు ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.3.64 కోట్లతో పనులు చేపట్టారు. మెయిన్ డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్, సబ్ డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్ తోపాటు ఎల్టి క్యూయోస్క్, యుటిలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్యానల్ పనులు పూర్తి చేశారు. గతంలా కాకుండా ప్రస్తుతం ప్రతి గేటుకు వేర్వేరుగా ఎలక్ట్రిఫికేషన్ పనులు చేయడంతో ఈ గేట్లను పైకెత్తేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్, మెకానికల్ విభాగానికి సంబంధించి అన్ని పనులు పూర్తయినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్లంబర్ బాక్సుల ఏర్పాటుతోపాటు రోలర్స్ ను కూడా మార్చేశారు. ప్రాజెక్టుపై ప్రస్తుతం ఉన్న 100 కేవీఏ జనరేటర్ కు పూర్తి మరమ్మతులతోపాటు అదనంగా మరో 100 కేవీఏ కెపాసిటీ గల జనరేటర్ ను ఏర్పాటు చేశారు. గేట్ల గ్రీజింగ్ కోసం కొత్తగా ఎయిర్ కంప్రెసర్ పరికరాలను వినియోగించారు. కుడివైపు ఉన్న విద్యుత్ లైన్ ను అదనంగా ఎడమ వైపు కూడా పొడిగించారు. స్పిల్ వేకు కూడా మరమ్మతులు పూర్తి చేశారు. గేట్ల కింది భాగంలో లీకేజీల వద్ద కూడా మరమ్మతులు చేయించారు.