ఫీజుల నియంత్రణ ఏది?

ఫీజుల నియంత్రణ ఏది?

రాష్ట్రంలో  కార్పొరేట్ స్కూళ్లు 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు అయిపోయినట్లు పూర్తయినట్లు చెబుతున్నారు. తమ పిల్లలకు ఇంగ్లీష్‌‌ మీడియం చదువులు చెప్పించాలనే ఉద్దేశంతో అడ్మిషన్ల కోసం ప్రైవేట్‌‌ స్కూళ్లకు వెళుతున్న తల్లిదండ్రులు అక్కడి ఫీజులు చూసి వాటిని కట్టడం తమ వల్ల కాదని నిరాశతో వెనుదిరిగి వస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. 

ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా తమ రూల్‌‌ తమదే అనేలా కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్ ప్రవర్తిస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఒకేసారి మొత్తం అడ్మిషన్ ఫీజు పాఠశాల ఫీజు కట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నాయి. లేదంటే అడ్మిషన్లు ఇవ్వమంటూ విద్యార్థుల తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు స్కూల్ లో టెస్టులు పెట్టి.. వాటిలో  మేనేజ్మెంట్ నిర్ణయించిన మార్కులు వస్తేనే సీట్లు ఇస్తున్నాయి. లేదంటే అడ్మిషన్ లేనట్టే. టెస్టు రాసేందుకు అడ్మిషన్లు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంటుండగా, కొన్ని నేరుగా స్కూళ్లలో ఫారాలు ఇస్తున్నాయి. దీనికి ఒక్కో స్కూల్లో రూ.500 నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నాయి. సీటు వచ్చినా, రాకపోయినా ఈ డబ్బులు తిరిగి ఇవ్వరు.

ప్రభుత్వ నియంత్రణ ఏది?

ప్రైవేటు, కార్పొరేట్‌‌ స్కూళ్ళల్లో ఫీజుల నియంత్రణ చేస్తాం. ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేడు విద్యారంగంపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. నేడు తెలంగాణలో కార్పొరేట్‌‌, ప్రయివేటు స్కూళ్లు మండల స్థాయి వరకు విస్తరించి ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే,  ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. పేద, మధ్య తరగతి తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ప్రయివేటు సూళ్ల యాజమాన్యాలు జలగల్లా పట్టి వారి రక్తాన్ని పీడిస్తున్నారు. 

తిరుపతిరావు కమిటీ రిపోర్టు ఏమైంది?

ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీ వేసింది. ఏడాదికి 10శాతం ఫీజులు పెంచుకోవాలని ఆ కమిటీ సిఫార్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదికను  ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉంది కానీ అమలుకు నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పింది. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

2009 విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మొత్తం సీట్లలో 25శాతం పేద పిల్లలకు ఇవ్వాలి. కానీ రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ విద్యాహక్కు చట్టాన్ని పట్టించుకోకుండా డొనేషన్, అడ్మిషన్ ఫీజుల పేరుతో నోట్​బక్​ల పేరుతో యూనిఫాంల పేరుతో కొన్ని రూ. లక్షలు వసూలు చేస్తున్నాయి. 

అధికారుల పర్యవేక్షణ లేదు

రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ ప్రవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ  కనిపించడంలేదు. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తున్నా.. తమకేమీ పట్టనట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఉంటున్నారు. యూనిఫామ్స్‌‌, బుక్స్‌‌, నోట్‌‌ పుస్తకాలకు ఇబ్బడి ముబ్బడిగా బిల్లులు వేసేస్తున్నారు. ఇవన్నీ తమ వద్దే కొనాలని హుకుం జారీ చేస్తున్నాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కార్పొరేట్‌‌ స్కూళ్లు ప్రభుత్వం నిర్ధేశించిన పాఠ్య పుస్తకాలను కాకుండా వారు రూపొందించిన పాఠ్యపుస్తకాల ద్వారా బోధన చేస్తున్నారు. వాటిని తమ పాఠశాలల్లోనే కొనాలని చెప్పి ఫీజులకు, పుస్తకాలకు లింకు పెడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకొని ఈ విద్యా సంవత్సరం నుండి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

  ముంజంపల్లి దేవేందర్,
ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్