జియో మాదిరే రిటైల్లో కూడా
13 మంది ఇన్వెస్టర్లతో చర్చలు
న్యూఢిల్లీ: ఇటీవలే ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తులను దక్కించుకున్న రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జియోలో మాదిరే రిలయన్స్ రిటైల్లో వాటాలను అమ్మే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. వాటాల అమ్మకం కోసం రిలయన్స్ గ్రూపు పలువురు ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నట్టు సమాచారం. రిటైల్ బిజినెస్లోకి గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తామని అంబానీ ఇటీవల ప్రకటించారు కూడా. కాగా, ఫ్యూచర్ గ్రూప్కు చెందిన రిటైల్, హోల్సేల్, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ బిజినెస్లను రిలయన్స్ రిటైల్ రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆర్గనైజ్డ్ రిటైల్ సెక్టార్లో రిలయన్స్ రిటైల్ మార్కెట్ వాటా 4.1 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం మార్కెట్ షేర్ 17.8 శాతానికి చేరుకుంది. ఈ కొనుగోలు వల్ల రిలయన్స్ రిటైల్ మరిన్ని సిటీలకు విస్తరించింది. కంపెనీ వేర్ హౌసింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. ఈ పరిస్థితులు తాజాగా లాంఛ్ చేసిన రిలయన్స్ ఈ–కామర్స్ ప్లాట్ఫామ్ జియో మార్ట్కు అనుకూలంగా మారనున్నాయి. దీంతో ఇండియన్ ఈ–కామర్స్ మార్కెట్లో లీడర్లయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్లను ఎదుర్కొనేందుకు జియో మార్ట్కు సులువు అవుతుంది. కంపెనీ బలంగా ఉంది కాబట్టి రిలయన్స్ రిటైల్లో ఇన్వెస్ట్మెంట్లకు చాలా మంది ముందుకు వస్తారనే అంచనాలు ఉన్నాయి.
వాటాలు కొననున్న ఫేస్బుక్, గూగుల్?
రిలయన్స్ రిటైల్లో వాటాల అమ్మకం కోసం రిలయన్స్ జియోలో ఇన్వెస్ట్ చేసిన 13 మంది ఇన్వెస్టర్లతో రిలయన్స్ చర్చిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫేస్బుక్, గూగుల్, కేకేఆర్, సిల్వర్ లేక్, టీపీజీ వంటి కంపెనీలతో ఆర్ఐఎల్ చర్చలు జరుపుతోందని పేర్కొన్నాయి. ఎఫ్డీఐ రూల్స్ ప్రకారం ఇండియన్ రిటైల్ కంపెనీలో విదేశీ రిటైల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్లపై పరిమితులున్నాయి. దీంతో జియో ప్లాట్ఫామ్లో వాటాలను అమ్మినట్టే, రిలయన్స్ రిటైల్లో కూడా వాటాలను ఫైనాన్షియల్ లేదా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లకు అమ్మాలని ఆర్ఐఎల్ చూస్తోంది. తాజాగా రిలయన్స్ రిటైల్లో ఒక బిలియన్ డాలర్లతో10 శాతం వాటాను సిల్వర్ లేక్ కొనుగోలు చేయనుందనే వార్తలు వచ్చాయి. ఈ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్లో 2.08 శాతం వాటాను కొన్నది. రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ 57 బిలియన్ డాలర్ల వద్ద ఈ డీల్ చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. జియో మార్ట్తో కలిపి రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ 65 బిలియన్ డాలర్లని అంచనా. దీనిని 57 బిలియన్ డాలర్లకు తగ్గించడం సరికాదని మోర్గన్ స్టాన్లీ కామెంట్ చేసింది. మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు వస్తే కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలపడుతుంది. లోకల్ ఈ-–కామర్స్ కంపెనీలతో పోటీ పడడానికి వీలుంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పులు రూ. 3.3 లక్షల కోట్లు కాగా, రిలయన్స్ రిటైల్ అప్పులు రూ. 4,618 కోట్లు.
పోటీ కంటే పార్ట్నర్షిప్ బెటరంటున్న ఎనలిస్టులు
రిలయన్స్ రిటైల్తో పోటీ పడడం కంటే కలిసి పనిచేయడానికే చాలా కంపెనీలు మొగ్గుచూపుతాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లు కూడా ఆన్లైన్ బిజినెస్ను విస్తరించాలంటే ఫిజికల్ రిటైల్ మార్కెట్లో తమ బలాన్ని పెంచుకోవాలి. అమెజాన్కు ఇప్పటికే ఫ్యూచర్ గ్రూప్లో మైనార్టీ వాటా ఉంది. ఇండియన్ రిటైల్ మార్కెట్లో విదేశీ కంపెనీలు తమ వాటాలను పెంచుకోవడంపై లిమిట్స్ ఉన్నాయి. దీంతో అమెజాన్ తన వాటాను ఫ్యూచర్ గ్రూప్లో పెంచుకోలేకపోయింది. ఇండియాలో వాల్మార్ట్ పెద్దగా సక్సెస్ కాకపోవడం ఫ్లిప్కార్ట్కు ఇబ్బంది కలిగించింది. దీంతో ఈ కంపెనీలు ఫిజికల్ రిటైల్పై పట్టుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రిలయన్స్ డిజిటల్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్లో 33 శాతం వాటాను విక్రయించడం ద్వారా రూ. 1.5 లక్షల కోట్లను ( 4.62 లక్షల కోట్ల వాల్యుయేషన్ లెక్కన) ముకేష్ అంబానీ సమీకరించగలిగారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వాల్యుయేషన్ రూ. 4.5 లక్షల కోట్లుగా ఉంది. వాల్మార్ట్ లాంటి మల్టీ నేషనల్ కంపెనీ రిలయన్స్ రిటైల్లో వాటాలను కొంటే కంపెనీ వాల్యుయేషన్ మరింత పెరుగుతుంది.