95 గిగావాట్ల కెపాసిటీ టార్గెట్
న్యూఢిల్లీ: సోలార్ పానెల్స్ తయారీని దేశంలో పెంపొందించడానికి ఉద్దేశించిన రూ. 19,500 కోట్ల ఇన్సెంటివ్స్దక్కించుకోవడానికి రిలయన్స్ఇండస్ట్రీస్, టాటా పవర్లు రంగంలోకి దిగాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఇన్సెంటివ్స్ను ప్రకటించింది. సోలార్ పానెల్స్ ఎక్కువగా దిగుమతి అవుతున్నది చైనా నుంచే. ఫస్ట్ సోలార్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు సైతం మన ప్రభుత్వం ప్రకటించిన ఇన్సెంటివ్స్ అందుకోవడానికి రెడీ అవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, అవాడా గ్రూప్, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ కంపెనీలు కూడా ఆసక్తితో ఉన్నట్లు బ్లూమ్బర్గ్ ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. ఇండియాలోని సోలార్ పానెల్స్ తయారీదారులలో పెద్దదైన అదానీ గ్రూప్ మాత్రం ఈ బిడ్స్లో భాగం పంచుకోలేదని పేర్కొంది. ఇండియాను మాన్యుఫాక్చరింగ్ హౌస్గా మార్చే క్రమంలో ఈ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వాలని మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎకానమీలో మరిన్ని ఉద్యోగాలు కల్పించడంతోపాటు, దిగుమతులు తగ్గించుకోవడం ద్వారా విలువైన ఫారెక్స్ను ఆదా చేయడంపైనా ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది.
చైనా దిగుమతులు వద్దనే.....
మాన్యుఫాక్చరింగ్లో చైనాకు ఆల్టర్నేటివ్గా ఇండియాను గ్లోబల్గా షోకేస్ చేసే ప్రయత్నాలను ప్రభుత్వం ఇటీవల ముమ్మరం చేసింది. కొవిడ్మహమ్మారి రాకతో సప్లయ్ చెయిన్స్లో వచ్చిన అంతరాయాల వల్ల చాలా దేశాలు ఇబ్బందులపాలయ్యాయి. దీంతో ఒకే చోట తయారీపై ఎక్కువగా ఆధారపడకూడదని గ్లోబల్ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. ఇలాంటి కంపెనీలను ఇండియాకు రప్పించాలనేది మన ప్రభుత్వ ప్రయత్నం. సోలార్ పానెల్ మాడ్యూల్స్ తయారీకి గ్రాంట్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. దేశంలోని సోలార్ పానెల్ మాడ్యూల్స్ తయారీ కెపాసిటీని 90 గిగావాట్లకు చేర్చాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఈ కెపాసిటీ దేశ అవసరాలకు సరిపోవడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతులు చేయడానికీ సరిపోతుందని అంచనా వేస్తున్నారు. దేశంలో అమలవుతున్న రెన్యువబుల్ ప్రాజెక్టులు గత కొంత కాలంగా స్లోగా నడుస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టులు నెమ్మదిస్తే రెన్యువబుల్ ఎనర్జీ టార్గెట్లను అందుకోవడం మన దేశానికి కష్టమవుతుంది. దీంతో, సోలార్ మాడ్యూల్స్ దిగుమతులను తాత్కాలికంగా అనుమతించాలని చూస్తున్నట్లు కిందటి నెలలోనే కేంద్ర ఎలక్ట్రిసిటీ మంత్రి రాజ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశంలోని ప్రాజెక్టులను చురుగ్గా పూర్తి చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రపోజల్ను పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.
టార్గెట్ రూ. 94 వేల కోట్ల పెట్టుబడులు...
చాలా రంగాలలో సొంత కాళ్లపై నిలబడేలా ప్రొడక్షన్ చేపట్టాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (పీఎల్ఐ) స్కీమును కేంద్ర ప్రభుత్వం కిందటేడాది తెచ్చింది. ఈ స్కీము కిందే సోలార్ మాడ్యూల్స్ మాన్యుఫాక్చరింగ్ కోసం రూ. 19,500 కోట్ల ఇన్సెంటివ్స్ ఆఫర్ చేస్తూ బిడ్లను పిలిచారు. సోలార్ మాడ్యూల్స్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో రూ. 94 వేల కోట్ల పెట్టుబడులు తేవాలనే టార్గెట్ను కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది.