- 3 నెలలుగా ఫ్లై ఓవర్ పనులు, యూటర్న్లతో ట్రాఫిక్ కష్టాలు
- నరకం చూసిన ఐటీ ఎంప్లాయీస్, వాహనదారులు
- గడువు లోపు పనులు పూర్తిచేయని బల్దియా
- తీవ్ర వ్యతిరేకత రావడంతో డైవర్షన్ ఎత్తివేత
- మళ్లీ రాకపోకలకు పోలీసుల అనుమతి
గచ్చిబౌలి, వెలుగు : ఐటీ కారిడార్లోని గచ్చిబౌలి – కొండాపూర్రూట్లో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల కారణంగా సైబరాబాద్ పోలీసులు విధించిన ట్రాఫిక్ డైవర్షన్తో ఐటీ ఉద్యోగులు, వాహనదారులు 3 నెలల పాటు ముప్ప తిప్పలు పడ్డారు. ఫ్లైఓవర్నిర్మాణ పనులు తొందరగా కంప్లీట్చేయడానికి సైబరాబాద్పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్పెట్టారు. దీంతో ఎక్కడ యూటర్న్ ఉందో.. ఎక్కడ వెహికల్స్ను టర్న్ తీసుకోవాలో.. యూటర్న్ లు ఎప్పుడూ క్లోజ్చేస్తారో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో గచ్చిబౌలి, ఐకియా, సైబర్టవర్స్ జంక్షన్లు ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించాయి. 30 నిమిషాల జర్నీకి మూడు, నాలుగు గంటల సమయం పట్టేది. ట్రాఫిక్ డైవర్షన్ గడువు పూర్తయినా జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్పిల్లర్లను కూడా పూర్తి చేయలేదు. వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండగా చేసేదేమి లేక తిరిగి వాహనాలను అనుమతిస్తున్నారు.
ఫ్లై ఓవర్పూర్తికి ట్రాఫిక్ డైవర్షన్
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల్లో భాగంగా ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, లింకు రోడ్లను నిర్మిస్తుంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి ఓఆర్ఆర్నుంచి ఐకియా వెనకాల వరకు శిల్పాలే అవుట్ఫ్లైఓవర్ తోపాటు ఫేజ్–2లో గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్రూట్లో మరో ఫ్లైఓవర్నిర్మాణం చేపట్టింది. కొండాపూర్రూట్లో పిల్లర్లను నిర్మించి త్వరగా ఫ్లైఓవర్పనులు పూర్తి చేసేందుకు బల్దియా అధికారులు వాహనాల రాకపోకలు బంద్ పెట్టి పనులు చేపట్టేందుకు నిర్ణయించారు. ట్రాఫిక్ డైవర్షన్కు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. మే13వ తేదీ నుంచి ఆగస్టు10వ తేదీ వరకు ట్రాఫిక్ డైవర్షన్అమలు చేస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ్ నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐటీ ఉద్యోగులు, వాహనదారులకు తెలిసేలా మీడియాలో న్యూస్ కవరేజ్చేసేందుకు మీడియా ప్రతినిధులను తీసుకొని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి జాయింట్సీపీ ఐటీ కారిడార్లో పర్యటించారు. ఎక్కడ ట్రాఫిక్డైవర్షన్ఉంది, యూటర్న్ఎక్కడ ఉందనే అంశాలను బస్సులో తిప్పుతూ వివరించారు.
ట్రాఫిక్ కష్టాలు తట్టుకోలేక..
ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా 90 రోజుల ట్రాఫిక్ డైవర్షన్ కారణంగా ఐటీ ఉద్యోగులు ముప్పతిప్పలు పడ్డారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్లో నరకం అనుభవించారు. ట్రాఫిక్ జామ్ల తో టైంకు ఆఫీస్లకు వెళ్లలేకపోయారు. కొందరూ వర్క్ ఫ్రంహోమ్ కు షిఫ్ట్ అయ్యారు. గచ్చిబౌలి, ఐఐఐటీ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ రూట్, డెలాయిట్ నుంచి ఇనార్బిట్మాల్రూట్లలో నిత్యం కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. అరగంట జర్నీకి గంట, రెండు గంటల సమయం పట్టింది. వాన పడితే గంటల పాటు ట్రాఫిక్లోనే ఉండాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ రూట్లు కూడా చూపెట్టకుండా ట్రాఫిక్ ఉన్నతాధికారులు అమలు చేసిన డైవర్షన్ తో వాహనదారులు ట్రాఫిక్ సిబ్బందితో గొడవకు కూడా దిగారు.
తీవ్ర వ్యతిరేకత కారణంగా..
ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ డైవర్షన్పై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. నిత్యం ట్రాఫిక్లో తిప్పలు పడుతుండగా ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్ పోలీసులు, బల్దియా అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏ రూట్లో ట్రావెల్ చేసినా ట్రాఫిక్ జామ్ లు కావడం, ప్రత్యామ్నాయ రూట్ లు చూపకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ డైవర్షన్అమలు తేదీ ముగియడంతో వాహనదారుల నుంచి మరింతగా వ్యతిరేకత వచ్చింది. దీంతో సైబరాబాద్ట్రాఫిక్ పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పది రోజు కిందట వరకు గచ్చిబౌలి – కొండాపూర్ రూట్లో పంపించగా.. శనివారం నుంచి రెండు వైపులా అనుమతించారు.
గడువు దాటినా సగమే పూర్తి..
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా గచ్చిబౌలి ఓఆర్ఆర్నుంచి కొండాపూర్వైపు నిర్మించే శిల్పా లేఅవుట్ ఫేజ్-2 ఫ్లై ఓవర్పనులు త్వరగా పూర్తి చేస్తామని బల్దియా అధికారులు చెబుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. ఓఆర్ఆర్నుంచి గచ్చిబౌలి చౌరస్తా వరకు పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. గచ్చిబౌలి చౌరస్తా నుంచి కొండాపూర్వైపు పిల్లర్లను 3 నెలల్లో పూర్తి చేసి ఫ్లైఓవర్ పనులను తుది దశకు తీసుకువస్తామని చెప్పారు. గడువు మూడు నెలలు దాటినా పిల్లర్ల నిర్మాణం కూడా కంప్లీట్చేయలేదు. కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే మిగిలాయి. వాటికి మరో ఏడాది పట్టేలా ఉందని.. అప్పటివరకు తిప్పలేనని ఓ ట్రాఫిక్ అధికారి పేర్కొన్నారు.