వెలుగు బిజినెస్ డెస్క్:మన దేశంలో రిటెయిల్ బూమ్ను ఏటా రూ. 2.50 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో సంపాదించే మాస్ కన్జూమర్లే ముందుండి నడిపించనున్నారట. దీంతో రిటెయిల్ మార్కెట్ 2030 నాటికి 1.3 ట్రిలియన్ డాలర్ల ఆపర్చునిటీ అవుతుందని ఒక రిపోర్టు వెల్లడించింది. ఆన్లైన్ బిజినెస్ (ఈ–కామర్స్) ఆపర్చునిటీ ఒక్కటే చూస్తే 300 బిలియన్ డాలర్లుగా ఉండనుందని, ఇది దేశపు రిటెయిల్ మార్కెట్లో 45 శాతానికి సమానమవుతుందని ఆ రిపోర్టు చెబుతోంది. తాము చెల్లించే డబ్బుతో మెరుగైన విలువుండే ప్రొడక్టులను కొనడానికే ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు పేర్కొంది. ఏ కొనుగోలు నిర్ణయానికైనా ఇప్పుడు ఇంటర్నెట్ కీలకంగా మారిందని వివరించింది. సంపన్నులలాగే మాస్ కన్జూమర్లు కూడా బెస్ట్ డీల్స్ వెతుక్కోవడానికైనా ఇంటర్నెట్పైనే ఆధారపడుతున్నారని తెలిపింది. మాస్ కన్జూమర్లలో 75 శాతం మిలినియల్స్, జెన్–జెడ్ కన్జూమర్లేనని రెడ్సీర్ రిపోర్టు వెల్లడించింది.
సొంతకాళ్లపై నిలబడిన జెన్– జెడ్ యువతరం బట్టలు, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఎక్కువగా కొంటుండగా, మరోవైపు మిలినియల్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, ఫుడ్ అండ్ గ్రోసరీ, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్టులంటే ఇష్టపడుతున్నారని రెడ్సీర్ రిపోర్టు తెలిపింది. ఇక జెన్–ఎక్స్ విషయానికి వస్తే ఎక్కువగా ఫుడ్ అండ్ గ్రోసరీ, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్టుల వైపు చూస్తున్నట్లు వివరించింది. పాత తరపు వ్యక్తులతో పోలిస్తే జెన్– జెడ్ కన్జూమర్లు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటున్నారని, కాకపోతే వారు కూడా విలువ ఆధారంగానే కొనుగోళ్లు జరుపుతున్నారని రెడ్సీర్ రిపోర్టు పేర్కొంది. క్వాలిటీ నచ్చితే అన్బ్రాండెడ్ ఐటమ్స్ కొనడానికి కూడా జెన్–జెడ్ కన్జూమర్లు ఇష్టపడుతున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్లో రేట్లు, డీల్స్, డిస్కౌంట్లు, ప్రొడక్టుల క్వాలిటీ, ప్లాట్ఫామ్పై ఉండే నమ్మకం....ఈ మూడు అంశాల ఆధారంగా తమ కొనుగోలు నిర్ణయాలను జెన్–జెడ్ కన్జూమర్లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
మిడిల్ క్లాస్....
ఏటా రూ. 10 లక్షల దాకా సంపాదించే జనాభాను మిడిల్ క్లాస్గా మన దేశంలో పరిగణించొచ్చు. ఇలాంటి మిడిల్ క్లాస్ జనాభా దేశంలో చాలా వేగంగా పెరుగుతోంది. 1995–2021 మధ్య కాలంలో ఈ కేటగిరీ జనాభా ఏటా 6.3 శాతం చొప్పున పెరిగారు. మొత్తం జనాభాలో వారి శాతం 31. 2031 నాటికి దేశంలో మిడిల్ క్లాస్ జనాభా 38 శాతానికి, ఆ తర్వాత 2047 నాటికి 60 శాతానికి పెరగనుందని అంచనా. దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి మిడిల్ క్లాస్ జనాభా 100 కోట్లకు చేరుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి లో–ఇన్కమ్ క్లాస్లోని చాలా మంది మిడిల్క్లాస్గా మారుతారని పేర్కొంటున్నారు.
రెండు గంటల్లోపే డెలివరీ కావాలి....
ఆన్లైన్ షాపింగ్ చేసే మన కన్జూమర్లు అసలు వెయిట్ చేయలేకపోతున్నట్లు ఒక సర్వేలో తేలింది. గ్రోసరీల నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల దాకా ...అన్నింటినీ ఆన్లైన్లోనే కొని, ఇంటి వద్దే డెలివరీ తీసుకోవడానికి భారతీయ కన్జూమర్లు ఇష్టపడుతున్నట్లు వండర్మాన్ థాంప్సన్ గ్లోబల్ రిపోర్టు వెల్లడించింది. ఆన్లైన్లో చేసే కొనుగోళ్లకు డెలివరీ రెండు గంటల లోపే జరగాలని 38 శాతం కన్జూమర్లు కోరుకుంటున్నట్లు ఈ రిపోర్టు తెలిపింది. ఈ–కామర్స్ ఇండస్ట్రీకి ఇప్పుడు క్విక్ డెలివరీస్ కీలకంగా మారిందని పేర్కొంది. ఫాస్ట్ డెలివరీ అంటేనే ఇండియన్ కన్జూమర్లు ఎక్కువ ఇష్టపడుతున్నట్లు క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో ఫౌండర్ ఆదిత్ పలిచ చెప్పారు. స్విగ్గీ ఇన్స్టామార్ట్, బ్లింకిట్, డంజో, బిగ్బాస్కెట్ నౌ, జెప్టోలు ఈ డిమాండ్నే ఆధారంగా చేసుకుని ఎదుగుతున్నాయి. ఈ కంపెనీలు గ్రోసరీలను సగటున 30 నిమిషాలలోపే అందించగలుగుతున్నాయి. ఈ మోడల్లో చాలా సవాళ్లు ఎదురవుతున్నా క్విక్ కామర్స్ కంపెనీలు మంచి ఎదుగుదలనే రికార్డు చేస్తున్నాయి. క్విక్కామర్స్లో స్లో డౌన్ ఛాయలే కనబడటం లేదని వండర్మాన్ థాంప్సన్ రిపోర్టు వెల్లడిస్తోంది. డిజిటల్ ప్రొడక్టులను ఆన్లైన్లో కొనే విషయంలో 45 శాతం వాటాతో గ్లోబల్గా ఇండియానే టాప్పొజిషన్లో నిలుస్తున్నట్లు వివరించింది.