2 వేల నోట్లు వెనక్కి.. ఆర్‌‌‌‌బీఐ సంచలన ప్రకటన

2 వేల నోట్లు వెనక్కి.. ఆర్‌‌‌‌బీఐ సంచలన ప్రకటన

2 వేల నోట్లు వెనక్కి.. ఆర్‌‌‌‌బీఐ సంచలన ప్రకటన
బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు
ఈ నెల  23 నుంచి సెప్టెంబర్ 30  దాకా గడువు
డిపాజిట్‌‌కు లిమిట్ లేదు.. ఎక్స్చేంజ్‌‌కు మాత్రం 
ఒక్కో విడతలో 10 నోట్లకే అనుమతి
నాలుగేండ్ల కిందనే 2వేల నోట్ల ప్రింటింగ్‌‌ నిలిపేసినం
‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2 వేల నోట్లను విత్‌‌డ్రా చేసుకోవాలని నిర్ణయించాం
‘లీగల్ టెండర్‌‌’‌‌గా కొనసాగుతాయని వెల్లడి

ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ) సంచలన ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటామని శుక్రవారం వెల్లడించింది. 23వ తేదీ (మంగళవారం) నుంచి సెప్టెంబర్ 30 దాకా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని సూచించింది. డిపాజిట్ విషయంలో ఎలాంటి లిమిట్ లేదని చెప్పింది. బ్యాంకుల్లో ఒకసారికి రూ.20 వేలు (10 నోట్లు) మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకునేందుకు వీలుందని చెప్పింది. మరోవైపు లావాదేవీల సమయంలో వినియోగదారులకు రూ.2 వేల నోట్లను ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది. బ్యాంకులకు ఈ మేరకు ప్రత్యేకంగా గైడ్‌‌లైన్స్ జారీ చేశామని, ప్రజలు ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ సౌకర్యాన్ని ఉచితంగానే ఉపయోగించుకోవచ్చని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. నల్లధనాన్ని దాచుకునేందుకు పెద్ద నోట్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుందని తెలుస్తున్నది. 

2018 – 19లోనే ఆర్‌‌‌‌బీఐ రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌‌ను నిలిపేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్‌‌లో కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. రూ.2 వేల నోటును లావాదేవీలకు పెద్దగా వినియోగించడం లేదని గమనించామని ఆర్‌‌‌‌బీఐ తెలిపింది. ఇతర డినామినేషన్లలోని నోట్ల స్టాక్.. ప్రజల కరెన్సీ అవసరాలను తీర్చడానికి సరిపోతుందని పేర్కొంది. ‘‘ఇతర డినామినేషన్లలోని నోట్లు తగిన పరిమాణంలో అందుబాటులోకి వచ్చాయి. రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టిన లక్ష్యం నెరవేరింది. అందుకే 2018-–19లో రూ.2 వేల నోట్ల ప్రింటింగ్‌‌ ఆపేశాం. ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం” అని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రూ.2 వేల నోట్లలో 89 శాతం దాకా 2017 మార్చికి ముందు ప్రింట్ చేసినవేనని చెప్పింది. వాటి జీవిత కాలం 4 నుంచి 5 ఏండ్లేనని తెలిపింది.

మేమే కరెక్ట్ అని నిరూపితమైంది : కాంగ్రెస్

రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటామన్న ఆర్‌‌‌‌బీఐ ప్రకటనపై ప్రధాని మోడీ టార్గెట్‌‌గా కాంగ్రెస్ మండిపడింది. మన ప్రధాని ముందుగా నిర్ణయం తీసుకుని, తర్వాత ఆలోచిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. 2016 నవంబర్ 8న  తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లను ఇప్పుడు విత్ డ్రా చేసుకుంటున్నారని  ట్వీట్ చేశారు. ‘‘నోట్ల రద్దు చేసిన కొన్ని రోజుల తర్వాత ఆర్‌‌‌‌బీఐ, కేంద్రం.. రూ.500 నోటును తిరిగి ప్రవేశపెట్టాయి. ఇప్పుడు రూ.వెయ్యి నోటును కేంద్రం మళ్లీ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు” అని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ‘‘రూ.2 వేల నోటు చెలామణీలో ఉంచేందుకు సరైన నోటు కాదు. మేం 2016 నవంబర్‌‌లోనే ఈ విషయం చెప్పాం. మేమే కరెక్ట్ అనే విషయం ఇప్పుడు నిరూపితమైంది. రూ. 500, రూ. 1,000 నోట్లను రద్దు చేయాలనే మూర్ఖపు నిర్ణయాన్ని కప్పిపుచ్చడానికి అతికించిన బ్యాండేజ్‌‌ లాంటిదే రూ.2,000 నోటు” అని ట్వీట్ చేశారు. ‘‘రూ.2 వేల నోటు ఎన్నడూ 'క్లీన్' నోటు కాదు. దీన్ని మెజారిటీ ప్రజలు ఉపయోగించలేదు. తమ నల్లధనాన్ని తాత్కాలికంగా దాచుకోవడానికి మాత్రమే చాలా మంది రూ.2 వేల నోట్లను ఉపయోగించారు’’ అని ఆరోపించారు.

రద్దు కాదు.. లావాదేవీలు చేయొచ్చు

2016లో మాదిరిగా ఇప్పుడు నోట్లను రద్దు చేయడం లేదని, రూ.2 వేల నోట్లను లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఆర్‌‌‌‌బీఐ చెప్పింది. ‘‘రూ.2 వేల నోట్లు లీగల్ టెండర్‌‌‌‌గా కొనసాగుతాయి. అంటే వీటితో లావాదేవీలు జరపొచ్చు. రూ.2 వేల నోటును ఇస్తే తప్పనిసరిగా అంగీకరించాలి” అని స్పష్టం చేసింది.  ‘‘2018 మార్చిలో రూ.2 వేల నోట్ల సర్క్యులేషన్ రూ.6.73 లక్షల కోట్లుగా ఉంది. 2023 మార్చి నాటికి రూ.3.62 లక్షల కోట్లకు తగ్గింది. 37.3 శాతం ఉన్న 2 వేల నోట్ల సర్క్యులేషన్ 10.8 శాతానికి పడిపోయింది” అని వివరించింది. 

2016లో నోట్ల రద్దు తర్వాత..

2016 నవంబర్ 8న రూ.వెయ్యి, 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిని బ్యాంకుల్లో డిపాజిట్/ ఎక్స్చేంజ్ చేసుకునేందుకు వీలు కల్పించింది. తొలుత కొత్త రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. తర్వాత రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 కొత్త నోట్లను తీసుకొచ్చింది. 

ఏం సాధించారు?

రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టి కేంద్రం ఏం సాధించింది? ఇప్పుడు విత్ డ్రా చేసుకోవడం ద్వారా ఏం సాధించబో తోంది. నోట్ల రద్దును పెద్ద విజయంగా ప్రకటించుకున్నారు. మరి ఇప్పుడు రూ.2 వేల నోట్లను ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు. ఇలాంటి నిర్ణయాలతో ప్రజలను ఎందుకు వేధిస్తున్నారనే ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలి.

- ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడే క్రాస్టో

19 ఆర్‌‌‌‌బీఐ రీజనల్ ఆఫీసుల్లోనూ ఎక్స్చేంజ్

ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2 వేల నోట్లను తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్‌‌‌‌బీఐ సూచించింది. లేదా ఏదైనా బ్యాంకు బ్రాంచ్‌‌లో ఇతర డినామినేషన్ నోట్ల (రూ.500, రూ.200, రూ.100..)తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చెప్పింది. బ్యాంకు కేవైసీ నిబంధనలు, చట్టాల ప్రకారం డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదని చెప్పింది. బ్యాంకుల సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండటానికి, రూ.20,000 వేల దాకా (10  నోట్లు) మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అనుమతి ఉందని వివరించింది. ఆర్‌‌‌‌బీఐకి చెందిన 19 రీజనల్ ఆఫీసుల్లో కూడా రూ.2 వేల నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చెప్పింది. ఇక బ్యాంకింగ్ కరెస్పాండెంట్ల దగ్గర రోజుకు రూ.4 వేల (2 నోట్లు) దాకా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చంది.